Pallavi Prashanth : రియాలిటీ షోలలో బిగ్ బాస్ కు యమా క్రేజ్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ షో 7 సీజన్లుతో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఆదివారం (డిసెంబర్ 17) సీజన్-7 విజయవంతంగా ముగిసింది. విన్నర్ గా రైతు బిడ్డ (కామన్ మ్యాన్) పల్లవి ప్రశాంత్ నిలిచాడు. సాధారణ వ్యక్తిగా వచ్చిన ఈయన ట్రోఫీ అందుకోవడం అంత ఆశామాషీ కాదు. అయితే ఆయన ఈ సీజన్ తో గెలిచిన డబ్బును ఏం చేస్తావని అడిగితే ఆయన చెప్పిన సమాధానం వింటే అందరూ ఆశ్చర్య పోయారు. ఆయన చేస్తున్న పనికి ఫిదా అవుతున్నారు. ఇప్పటికీ ఇలాంటి నిర్ణయం ఏ విన్నర్ తీసుకోకపోవడంతో ఆయనపై ప్రశంసల వెల్లువ కురుస్తుంది.
సామాన్యుడిగా వచ్చి..
బిగ్ బాస్ సీజన్-7 ముగిసింది. ఫైనలిస్టులుగా అమర్, ప్రశాంత్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. చివరికి అనూహ్య పరిణామాల మధ్య ప్రశాంత్ ను హోస్ట్ నాగార్జున విజేతగా ప్రకటించారు. ఎన్నడూ లేని విధంగా ఓ కామన్ మ్యాన్ టైటిల్ గెలిచారు. బిగ్ బాస్ విజేత ప్రశాంత్ కు ట్రోఫీతో పాటు రూ.35 లక్షల చెక్ అందజేశారు. ఈ డబ్బును విజేత తల్లిదండ్రులైన సత్యనారాయణ-విజయలక్ష్మిని పిలిచి ఇచ్చారు. ఇవే కాకుండా మారుతీ సుజుకీ హాట్ అండ్ టెకీ బ్రెజా ఎస్యూవీ కూడా ప్రశాంత్ కు అందజేశారు. డైమండ్ జువెలరీ కొనుగోలు చేసేందుకు జోయలుక్కాస్ మేనేజింగ్ డైరెక్టర్ జాన్ అలుక్కా రూ.15 లక్షల చెక్కు ఇచ్చారు.
హృదయాల్ని కదిలించిన స్పీచ్
విజేతగా ప్రకటించగానే ప్రశాంత్ చాలా ఎమోషన్ అయ్యాడు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాడు. హోస్ట్ నాగార్జున గురించి మాట్లాడుతూ తన గురించి చెప్పుకొచ్చాడు. ‘నేను తిండి తినని రోజులు ఎన్నో ఉన్నాయని, స్టూడియో చుట్టూ చక్కర్లు కొట్టానని, నాకు తండ్రి మద్దతు పుష్కలంగా ఉంది’ అన్నాడు. ఈ పట్టుదలే తనను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టేలా చేసిందని చెప్పాడు. నాగార్జున పై ఓ కవిత చెప్పాడు. తనకు వచ్చిన రూ.35 లక్షల ప్రైజ్ మనీ రైతులకే ఇస్తానని చెప్పడంతో అక్కడున్న వారంతా అభినందించారు. తాను సామాన్యుడినని, రైతుల కష్టాలు తెలిసిన వాడినని, అందుకే ఈ డబ్బును వారికి పంచిస్తానని చెప్పాడు. ఇక మిగిలిన కారు నాన్నకు, నెక్లెస్ అమ్మకు ఇచ్చేస్తానని తెలిపాడు.