AP Telangana BJP Presidents : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నాయకత్వ మార్పుకు శ్రీకారం చుట్టింది. పార్టీ అధ్యక్షులను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నాయకత్వ మార్పుపై కొద్ది కాలంగా వస్తున్న వదంతులకు తెర పడినట్లు అయింది. ఏపీలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, ఈటెల రాజేందర్ ను ఎన్నికల నిర్వహణ కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
పార్టీ పరిస్థితి ఏమవుతుందో?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్ పార్టీని గాడిలో పెట్టారు. ఎన్నికల వరకు ఆయన నేతృత్వంలోనే కొనసాగితే బాగుండేదని పలువురు నేతలు పేర్కొంటున్నారు. అకస్మాత్తుగా నాయకత్వ మార్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే వాదనలు వస్తున్నాయి. జాతీయ పార్టీల్లో ఉన్న తెలివితక్కువ పని ఇదేనని అంటున్నారు. పార్టీ మంచి ఫామ్ లో ఉండగా నాయకత్వ మార్పు చేస్తే పార్టీ ఫామ్ కోల్పోతుందని నిట్టూరుస్తున్నారు.
సంజయ్ పై పెరిగిన అసంతృప్తి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై నేతల్లో అసంతృప్తి పెరిగింది. నేతల ఒత్తిడితోనే బండిని తప్పించినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా మూడేళ్ల పదవీ కాలం పూర్తయినందున ఆ పదవి నుంచి తప్పించాలని చాలా మంది నేతల నుంచి సూచనలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాయకత్వ మార్పుపై పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రోద్బలంతోనే సంజయ్ ను బాధ్యతల నుంచి తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి.
‘బండి’కి కేంద్ర మంత్రి పదవి?
బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా మూడేళ్లు సమర్థవంతంగా పనిచేసినందున ఆయనకు గుర్తింపుగా కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చెబుతున్నారు. కానీ ఇంత వరకు కేంద్రం నుంచి ఎలాంటి సంకేతాలు మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీలో ఏం జరుగుతోంది? ఎందుకు నాయకత్వ మార్పిడి చేపడుతున్నారనే దానిపై కచ్చితమైన క్లారిటీ మాత్రం లేదు.