Purandeshwari :
దీంతో పాటు ఏపీకి రాజధాని అమరావతి మాత్రమేనంటూ ఆమె జాతీయ పార్టీ ఏపీ అధ్యక్షురాలి హోదాలో తేల్చేశారు. తాజాగా గుంటూరులో జరిగిన బీజేపీ కోస్తాంధ్ర జోనల్ సమావేశంలో ఆమె ఈ మేరకు ప్రకటించారు. ఇకపై సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. క్షేత్రస్థాయిలోకి వెళ్తానని పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా పార్టీలోని ప్రతి నాయకుడిని కలుపుకొని వెళ్తానని చెప్పారు. అయితే రాజమండ్రిలో జరిగే గోదావరి జోనల్ సమావేశానికి బుధవారం ఆమె హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఇక పోరాటం తప్పదని స్పష్టం చేయనున్నారు. ఏపీలో ఇక బీజేపీ గాడిలో పడినట్లేనని అంతా చర్చించుకుంటున్నారు. పార్టీ బలోపేతంపై పురందేశ్వరి వేగంగా వేస్తున్న అడుగులు, సమాలోచనలు సఫలికృతం కావాలని శ్రేణులు భావిస్తున్నాయి.
ఆమె అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు మొదలు పెట్టారు. రాష్ర్టంలో వ్యవస్థ మొత్తం భ్రష్టుపట్టిందని మండిపడ్డారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్పు పై కూడా ఆమె మరోసారి స్పందించారు. ఇది ఆ మహానుభావుడిని అవమానించడమేనని మండిపడ్డారు. దీనిపై ఖచ్చితంగా తమ వ్యతిరేకతను చూపుతామని చెప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వ తీరుపై ఇక రాష్ర్ట వ్యాప్త నిరసనలకు కార్యాచరణ రూపొందిస్తామని, ప్రజల్లోకి వెళ్లి జగన్ వైఖరిని ఎండగడుతామని చెప్పారు. జాతీయ నాయకత్వం మార్గదర్శకత్వంలో పనిచేస్తానని, రాష్ర్ట ప్రయోజనాల కోసం పాటుపడతానని చెప్పుకొచ్చారు. పొత్తుల అంశం జాతీయ అగ్ర నాయకత్వం తీసుకుంటుందని తేల్చి చెప్పారు. అయితే రాష్ర్టంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. అయితే సీఎం జగన్ కు మాత్రం పురందేశ్వరి గట్టి వార్నింగే ఇస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇకపై ప్రభుత్వం పై పోరాటమేనని చెప్పడం ద్వారా ఆమె అధిష్టానం నిర్ణయం కూడా ఇదే అనే సంకేతాలు పంపారు.