AP : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ చదరంగం మొదలైంది. అటు వైసీపీ ఇటు టీడీపీ గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. చంద్రబాబు రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. మరోసారి అధికారం కోసం రెండు పార్టీలు ఎవరి దారి వారే చూసుకుంటున్నాయి.
2014, 2019 ఎన్నికల్లో చంద్రబాబు అన్ని తానై నడిపించారు. ఇప్పుడు కూడా అన్నింట్లో ముందుండి నడిపిస్తున్నారు. అధికారం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. హామీల వరద పారిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రచారంలో దూకుడు పెంచారు.
పార్టీ నేతలకు గెలుపుపై దిశా నిర్దేశం చేస్తున్నారు. ప్రజల మధ్య ఉంటేనే పార్టీకి గుర్తింపు ఉంటుందని సూచిస్తున్నారు. ప్రజల మధ్య లేకపోతే మనకు సమస్యలు తెలియవు. దీంతో ఎదుటి పార్టీ దాన్ని క్యాష్ చేసుకుంటే మనకే నష్టం వస్తుంది. అందుకే కార్యకర్తలు ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటే మంచి ఫలితాలు రావడం ఖాయమని చంద్రబాబు పేర్కొంటున్నారు.
తెలుగు తమ్ముళ్లు భయపడకుండా విజయం కోసం ముందుకు వెళితే చాలు. గెలుపు మనదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీని తుదముట్టించి టీడీపీకి మళ్లీ అధికారం వచ్చేందుకు తగువిధంగా పనిచేయాలని చెబుతున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి కచ్చితమేనని అంటున్నారు. కార్యకర్తలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ విజయం సాధించాలని కార్యకర్తలకు ప్రణాళికలు సూచిస్తున్నారు.