Guntakal Junction : ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రాష్ట్రమంతటా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తూ నగదు, మద్యం పంపిణీని అడ్డుకుంటున్నారు. తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపట్టిన పోలీసులకు భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది. గుంతకల్ రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కేందుకు సిద్ధమైన ఓ మహిళ బ్యాగ్ ను పోలీసులు తనిఖీ చేయగా అందులో రూ. 50 లక్షలు నగదు ఉన్నట్లు గుర్తించారు. ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోవడంతో సీజ్ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రమంతా ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో రూ. 50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్ల వద్దని అధికారులు ఇదివరకే ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ డబ్బు తీసుకెళ్లాల్సి వస్తే సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలని అధికారులు సూచించారు.