CM Jagan : రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని సీఎం జగన్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేస్తున్నారు. డిసెంబర్ 31లోపు 50మంది ఇన్చార్జుల మార్పుతో రెండో జాబితా ప్రకటిస్తారని.. వారంతా జనవరి 1వ తేదీ నుంచి ‘పెన్షన్ కానుక’ పంపిణీతో ప్రజల్లకి వెళ్తారని నాలుగు రోజులుగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ జాబితా విడుదల కాలేదు.. మెల్లమెల్లగా పాత అభ్యర్థులకే టికెట్లు ఖరారు చేస్తున్నట్టుగా సమాచారం అందిస్తున్నారు.
షర్మిల ఎంట్రీతో భయం..
ఏపీ కాంగ్రెస్ పార్టీకి షర్మిల అధ్యక్షురాలు కానున్నారు. ఆమె ఆ పార్టీలో చేరడం దాదాపు లాంఛనమే అని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి కడప నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని సంకేతాలు పంపుతున్నారు. అదే టైంలో క్రిస్మస్ పండుగకు టీడీపీ ముఖ్య నేతలకు ఎన్నడూ లేనివిధంగా క్రిస్మస్ కానుకలు పంపారు. టికెట్ రాదని తెలిసి వైసీపీకి టాటా చెప్పిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తాను షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. టికెట్లు నిరాకరించే చాలా మంది అదే పని చేయబోతున్నారని తెలుస్తోంది. టికెట్లు రానివారికి టీడీపీ, జనసేనల్లో చాన్స్ దొరకదు. కానీ షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీలో చోటు దొరికే అవకాశం ఉండడంతో అందరూ అటువైపు చూస్తున్నారు.
నేతల ధిక్కారం..
వైసీపీలో గతంలో జగన్ ఏదంటే అదే నడిచేది. ఆయన అలాగే భావించేవారు. తాజాగా మార్పులు, చేర్పులతో నేతల్లో ధిక్కార స్వరం వినపడుతోంది. జగన్ కు నమ్మినబంటు ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన తిరుగుబాటే దానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి అవకాశం రాని నాయకులు కూడా అదే బాట పట్టనున్నట్లు సమాచారం. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి సీఎం జగన్ తనను నమ్మలేదంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. రాజకీయ పార్టీల్లో ఒక్కసారి అంటుకుంటే అది దావాలనం అవుతుంది. ఎదురుగా షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే.. ఇక వైసీపీ నేతల కట్టుతెగిపోతుందన్న విశ్లేషకులు అంటున్నారు.
వారికే టికెట్లు..
మొన్నటిదాక మార్పులు చేర్పులు అన్న జగన్ రూట్ మార్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను మార్చకుండా ఎన్నికలకు వెళ్లిన బీఆర్ ఎస్ ఓడిపోవడంతో.. తనకు అలాంటి పరిస్థితి ఎదురుకావొద్దని జగన్ భావించారు. అందుకే ఎడాపెడా అభ్యర్థులను మార్చాలని చూశారు. తాజా పరిణామాలతో మళ్లీ పాత వారికే సీట్లు అనే సమాచారం పంపుతున్నారట. మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ ను మార్చేస్తామని ముందుగా నిర్ణయించారు. ఇప్పుడు ఆయనకే సీటు కన్ఫర్మ్ చేశారు. అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, రోజా, అంబటి రాంబాబు సహా కీలక నేతల అందరి పేర్లు మార్పు జాబితాలోకి వెళ్లినా మళ్లీ వారికే టికెట్లు ఇస్తున్నామని సమాచారం ఇచ్చారు. మొత్తానికి ఓ పది, ఇరువై సీట్లలోనే అభ్యర్థుల మార్పు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.