Congress-BJP : లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోక్ సభ స్థానంలో హస్తం పార్టీ అభ్యర్థి అక్షయ్ కాంతి బమ్ అనూహ్యంగా పోటీ నుంచి వైదొలిగారు. చివరి నిమిషంలో తన నామినేషన్ ను వెనక్కి తీసుకొని.. పార్టీని వీడి బీజేపీలో చేరారు.
ఇండోర్ లోక్ సభ నియోజకవర్గానికి నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు నేడు (ఏప్రిల్ 29) ఆఖరు రోజు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం అక్షయ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మెండోలా ఉన్నారు.
అక్షయ్ కాషాయ పార్టీలో చేరిన విషయాన్ని రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత కైలాశ్ విజయ్ వర్గియ ధ్రువీకరించారు. ఆయనతో ఒకే కారులో వెళ్తున్న ఫొటోను షేర్ చేసి పార్టీలోకి స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇండోర్ నుంచి బీజేపీ నుంచి సిటింగ్ ఎంపీ శంకర్ లల్వానీ బరిలో ఉన్నారు. బీఎస్పీతో పాటు స్వతంత్రులు కొంతమంది ఇక్కడి పోటీ చేస్తున్నారు.