Ramakrishna : అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని బీజేపీ జాతీయ నేత ప్రధాన కార్యదర్శి దురుషాంత్ కుమార్ గౌతమ్ క్లారిటీ ఇచ్చారని, బీజేపీకి మెజార్టీ వస్తే మాత్రం కచ్చితంగా రాజ్యాంగం మారుస్తారని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు రాజ్యాంగం మార్పు విషయంపై వైఖరిని ఓటర్లకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
అధికారం లోకి వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తి లేదని ప్రధాని మోదీ చెప్పారని రామకృష్ణ తెలిపారు. చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారని.. ఇది ఎలా నమ్మాలని ఆయన ప్రశ్నించారు. బీసీ కుల గణన చేయడానికి బీజేపీ వ్యతిరేకమన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజల్లో, లాయర్లకు, కొన్ని రాజకీయ పార్టీలకు అనుమానం ఉందని రామకృష్ణ తెలిపారు.