Chandrababu-BJP : ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు ఖాయంగా కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన ఇప్పటికే కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో బీజేపీ కూడా చేరుతుందని అనుకుంటున్నారు. సంకేతాలు కూడా వస్తున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంపైనే తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. బీజేపీ ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది. దీంతో పొత్తు ఖరారవుతుందా? లేక విడిగానే పోటీ చేస్తాయా? అనేది తేలాల్సి ఉంది.
ఏపీలో అధికార మార్పిడికి గల అవకాశాలను వినియోగించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. అందివచ్చే దేన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. జగన్ ను గద్దె దించడమే ఆయన ధ్యేయం. దాని కోసం ఎంత దాకా అయినా వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. ఇక బీజేపీని కూడా కలుపుకుని జగన్ ను గద్దె దింపాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
జనసేన మొదట 40 సీట్లు అడిగినా బీజేపీ కూడా కలుస్తుండటంతో ఆ సంఖ్యను 25కు తగ్గించుకునేందుకు పరిమితం కానుందని సమాచారం. బీజేపీకి కూడా 25 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలు కావాలని కోరుతోంది. చంద్రబాబు 6 ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో పొత్తుల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో తెలియడం లేదు.
ఇందులో భాగంగా అరకు, విశాఖపట్నం, ఏలూరు లేదా రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలు బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపినట్లు చెబుతున్నారు. విశాఖ నుంచి జీవీఎల్ నరసింహారావు, రాజమండి నుంచి పురంధేశ్వరి, విజయవాడ నుంచి సుజనా చౌదరి, రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉంటారని అంటున్నారు.
ఎమ్మెల్యే స్థానాల్లో అరకు, విశాఖ ఉత్తరం, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, రాజమండ్రి సిటీ, ఉంగుటూరు/తాడేపల్లి గూడెం, కైకలూరు, విజయవాడ సెంట్రల్, శ్రీకాళహస్తి, మదనపల్లె, జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్, ఒంగోలు, ప్రత్తిపాడు నియోజకవర్గాలున్నాయని చెబుతున్నారు.