YCP : 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ తన రెండేళ్ల అనంతరం నుంచే 2024 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని చెబుతూ వస్తున్నారు. 175 సీట్లకు మొత్తం గెలుచుకోవాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ప్రజల్లో మమేకమై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు వివరించాలని ఆదేశించారు. సీఎం జగన్ సైతం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఆయా రిపోర్టుల ఆధారంగా వారి పనితీరు మార్చుకోవాలని, లేదా మరింత మెరుగు పర్చుకోవాలని సూచిస్తూ వస్తున్నారు.
అయితే వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి శుక్రవారం బాపట్ల జిల్లాలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరుపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడారు. “రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి కల్పిస్తున్నామని, రాష్ట్రంలో 51 శాతం పైగా ప్రజలు మనవైపే ఉన్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 151 సీట్లు కచ్చితంగా గెలుస్తాము. అంతకంటే ఎక్కువే గెలుస్తామే తప్ప 151కి ఒక్క సీటు కూడా తగ్గదన్నారు. ఈసారి ఎన్నికల్లో వలంటీర్లు పార్టీకి కీలకం కానున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. పార్టీ నేతలందరూ వారి సేవలను ఉపయోగించుకోవాలని, ప్రతీ ఇంట్లో ఓటర్లను వైసీపీ వైపు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం,” అని అన్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఓట్ల కోసమేనని మరోసారి స్పష్టమైంది.
అలాగే ప్రజాధనంతో జీతాలు పొందుతున్న వలంటీర్ల వ్యవస్థను వైసీపీ కోసమే ఏర్పాటు చేసుకున్నట్లు కూడా అర్థమవుతున్నది. వలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని కోర్టులు, ఎన్నికల సంఘం ఆదేశించినా వైసీపీకి అదేమీ పట్టడ లేదు. వారితోనే ఓటర్లను ప్రభావితం చేయించబోతున్నదనే విషయం కూడా కూడా స్పష్టమవుతున్నది. ఈసారి 175 సీట్లు వైసీపీకే వస్తాయని జగన్ చెబుతుంటే విజయసాయి రెడ్డి మాత్రం 151 సీట్లు అని చెప్పడం గమనార్హం. ఇప్పుడే ఆయన 24 సీట్లు కోత పెట్టేశారు. దీంతో వైసీపీ నేతల ప్రగల్భాలకు, వాస్తవాలకు చాలా దూరం ఉందనే విషయం అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలు దగ్గర పడే సమయానికి ఈ సంఖ్య ఇంకా తగ్గుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 40 మంది పనితీరు బాగోలేదని ఐప్యాక్, 18 మంది పనితీరు బాగోలేదని జగన్ స్పష్టం చేశారు. కనుక వారిని మార్చక తప్పదని జగన్ భావించడంతో పాటుకు వారికీ నేరుగా చెప్పేశారు. అంతకు ముందు కొందరు మంత్రుల పనితీరు నచ్చక పదవుల నుంచి పక్కన పెట్టేశారు. ఈ లెక్కన వైసీపీలో ఎంతమందికి విజయావకాశాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.