Viral Video : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతల ప్రసంగాలు ఘాటెక్కుతున్నాయి. ఇప్పటికే అధినేతలు అందరూ ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో ఒక్క క్షణం కూడా తీరికగా ఉండడం లేదు. అభ్యర్థుల తరుఫున ప్రచారం చేయడానికి సతీమణులు సైతం రంగంలో దిగుతున్నారు. అలాగే అధినేతల తరుఫున కుటుంబ సభ్యులందరూ జనాల్లోకి వెళ్తున్నారు. ఇలా ఏపీలో ఎటు చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. ప్రజల్లో ప్రత్యక్షంగా ప్రచారం చేయడంతో పాటు సోషల్ మీడియా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడం కన్నా ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోయడం, వారిని ఇరుకున పెట్టే వీడియోలు, మీమ్స్, ఆర్టికల్స్ నే క్రియేట్ చేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేలా వైసీపీ ప్రచారం చేయిస్తోంది. ఇక జగన్ గత ఐదేళ్లుగా చేసిన పాపాలను ప్రజల ముందు టీడీపీ, జనసేన ఉంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఓ పేరడీ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ పేరడీ వీడియోలోని క్యారెక్టర్లు మనకు తెలిసినవే కావడంతో కామెడీ మరింత పండుతోంది. సీరియస్ ఇష్యూలోనూ కామెడీ రక్తికట్టడంతో నవ్వకుండా ఉండలేం. ఇది ఓ పార్టీ అధినేతపై చేసిన పేరడీ కావడం గమనార్హం. ఈ వీడియోను ఓ పార్టీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.
ఈ వీడియోలో ఏముందంటే.. ఓ పార్టీ అధినేతకు, ఆయన భార్యకు, వరుసకు తమ్ముడయ్యే వ్యక్తి మాట్లాడుకునే సందర్భం అది. ఇందులో రెండో సారి గెలవడానికి ఏం చేయాలో తీవ్రంగా భార్యాభర్తలు ఆలోచిస్తుంటారు. ‘‘నీకు ఏం చేతకాదు అందుకే మా వినాశ్ బావను రమ్మన్నాను..’’ అని భార్య అంటుంది. ఇంతలో అతడు వస్తాడు. ముగ్గురు కలిసి గెలవడానికి ఏం చేయాలో దీర్ఘంగా ఆలోచిస్తుంటారు. ఇంతలో భార్య..‘‘ మీ నాయన శవం నిన్ను నాయకుడిగా చేసింది.. మీ చిన్నాన్న శవం మొదటిసారి సీఎంను చేసింది..ఇక రెండో సారి సీఎం కావాలంటే మూడో శవం కావాలి..’’ అంటూ భర్తకు సలహా ఇస్తుంది. మరి ఎవరినీ లేపేద్దామంటూ ముగ్గురు ఆలోచిస్తుండగానే..మీ అమ్మను అంటాడు వినాశ్. ఈ ఐడియా నచ్చడంతో అధినేత తన అమ్మకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు. సీసీ కెమెరాలు ఉన్న చోటుకో, బహిరంగ సభకో వస్తాను గాని మీ ఇంటికి రానయ్యా అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఇలానే చెల్లి కూడా ఇదే సమాధానం ఇస్తుంది..ఇలా సాగుతుంది వీడియో. మొత్తానికైతే చూసిన ప్రతీ ఒక్కరిని తెగ నవ్విస్తోంది.