Jagan Clearing Line For Babu : ఏపీలో అసలు ఏం జరుగుతుందో అధికార పార్టీకి తెలుసా.. జగన్ ను పీకే మాయ కమ్మేసిందా.. లేదంటే ఇంటలిజెన్స్ నమ్ముకొని, తన కోటరీని నమ్ముకొని ఉన్నాడా.. అంటే అదే నిజమనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్నది. రాష్ర్ట రాజకీయాల్లో సీనియర్, ఎంతో అనుభవం ఉన్న లీడర్ అంటే చంద్రబాబే. అయితే ఆయన విషయంలో ప్రభుత్వం, ఏపీ సీఐడీ వ్యవహరించిన తీరును ప్రతి ఒక్కరూ ఖండించారు. అయితే ఆయనను 53 రోజులు రాజమండ్రి జైలులో ఉంచారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సానుభూతి ప్రజల గుండెల్లోకి చేరింది.
నిజానికి ఏపీలో చంద్రబాబుపై అంత వ్యతిరేకత ఏం లేదు. ఒక్క చాన్స్ అంటే ఏదో చేస్తాడని అనుకొని జగన్ ను నెత్తిమీద తెచ్చి పెట్టుకున్నారు. ఇఫ్పుడు ఆయన చేస్తు్న్నది చూసి జనం నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం జరిగింది చూస్తే సీన్ మొత్తం జగన్ కు అర్థం అయ్యి ఉంటుంది. తాము పప్పులో కాలేసినట్లు ఒక క్లియర్ కట్ వైసీపీ అధినాయకత్వానికి వచ్చి ఉండాలి.
టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచి మంగళవారం సాయంత్రం 4.15 నిమిషాలకు విడుదలయ్యారు. ఆయన అక్కడి నుంచి సాయంత్రం 4.40 నిమిషాలకు ఉండవల్లి బయల్దేరారు. నిజానికైతే కేవలం మూడు గంటల్లో ఇంటికి చేరాలి. కానీ తెల్లారి 7 గంటలకు ఆయన ఇంటికి చేరుకున్నారు. 14 గంటల పాటు ఆయనకు జనం హారతి పట్టింది. రాత్రంతా చంద్రబాబును చూసేందుకు అన్ని గ్రామాల్లో ప్రజానీకం దారికట్టింది. ఎక్కడికక్కడా పూల వర్షం కురిపించింది. అయ్యా.. ఇక మీరే మాకు దిక్కు అన్నట్లు జనం కన్నీళ్లు పెట్టుకుంది. అయితే పోల్ మేనేజ్ మెంట్ స్కిల్స్ మెండుగా చంద్రబాబు ఈ అవకాశాన్ని వదులుకోరు. ఇప్పటికైనా వైసీపీ మేల్కుకోకపోతే ఇక అంతే. ఇప్పటికే కాగల కార్యం జగనే చేసిపెట్టడాని టీడీపీ శిబిరం సంబుర పడుతున్నది. చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపే అని నమ్మేవారే ఎక్కువగా ఉన్నారు. ఆయన వర్గం మీడియా కూడా అదే జనాల్లోకి తీసుకెళ్లింది. ఇక టీడీపీ పూర్తిస్థాయిలో సక్సెస్ అయినట్లే.
సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు జగన్ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయించి లేని ఆదరణను తెచ్చి పెట్టారు. ఇక్కడే కాదు చంద్రబాబుకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ వచ్చింది. ఆయన కోసం కసిగా పని చేస్తామని చాలా మంది నేరగానే చెబుతున్నారు. సినీ, ప్రొఫెషనల్స్ చంద్రబాబు గెలుపు కోసం సహకరిస్తామని నేరుగా చెబుతున్నారు. ఇక ఇప్పటికైనా వైసీపీ తేరుకోకపోతే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీనిని ఎవరూ ఆపలేరు. చంద్రబాబు విషయంలో ఇప్పటికైనా పట్టు వీడకపోతే జనం తన పని తాను చేసుకుపోతుంది. ఆపై టీడీపీ గెలిస్తే ఇక వైసీపీ నాయకుల పరిస్థితిని ఎవరూ అంచనా వేయలేరు. చక్రవడ్డీ ఇస్తామని ఇఫ్పటికే చాలా సందర్భాల్లో లోకేశ్ ప్రకటిస్తూనే వస్తున్నారు. మరి జగన్ ను నమ్ముకొని ఇన్నాళ్లూ మీసం తిప్పిన నేతలు, ఎగిరెగిరి పడిన నేతలు రేపటి రోజు చంద్రబాబు ను శరణుకోరాల్సిన అవసరం కూడా రావచ్చు. ఏదేమైనా అంతా ఏపీ ప్రజల చేతుల్లోనే ఉంది. సమర్థ నాయకత్వం ఎవరని నమ్ముతారో వారి వెంటే జనం ఉంటారు. అది ఎలాగూ కనిపిస్తూనే ఉంది.