Telangana TDP :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగిన టీడీపీ ప్రస్తుతం తెలంగాణ లో ఉనికి ని చాటుకోవాల్సిన దుస్థితి వచ్చింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చేరారు. కొందరు ఏ పార్టీలోకి వెళ్లకపోయిప్పటికి టీడీపీలోనూ కనిపించడం లేదు. మరి కొద్ది రోజుల్లో తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనున్నది. కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు కావడంతో ఆ పార్టీ దిశానిర్దేశం లేకుండా పోయింది. తెలంగాణలో ఆ పార్టీకి పెద్ద దిక్కు ఎవరూ లేకుండాపోయారు. పార్టీని ముందుండి నడిపించే నాయకుడు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు.
అసెంబ్లీ బరిలో నిలిచేనా?
మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ పోటీ చేయాలి.. ఎవరితో పోటీ చేయాలన్నదానిపై స్పష్ట త లేకపోవడంతో బాలకృష్ణ రంగంలోకి దిగారు. పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఏపీలో టీడీపీతో ముందుకు సాగుతామని ప్రకటించిన జనసేన.. తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించింది. ఆ స్థానాలన్నీసెటిలర్లు బలంగా ఉండేవే. టీడీపీ కూడా వాటిపైనే ఆశలు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ బలమైన స్థానాల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నది. అభ్యర్థులు కూడా ఉన్నారు. బలమైన నేతలు కాకపోయినా గట్టిగా ప్రయత్నించే నేతలు మాత్రం ఉన్నారు. చంద్రబాబు బయట ఉండి ఉంటే ఈ పాటికి కీలక నిర్ణయాలు తీసుకొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేవారు. గతంలో ఢిల్లీలో బీజేపీతో పొత్తుకు సమయం మించిపోయిందని చెప్పారు. ఇక పొత్తులు ఉండవని అంతా అనుకున్నారు. కానీ బాలకృష్ణ ఎవరితో పోటీ చేయాలనేది చంద్రబాబు నిర్ణయిస్తారని చెప్పడం విశేషం. టీడీపీ నేతలు పొత్తులు ఉంటాయని మాత్రం భావించడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో పాటు పాటు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తున్నది. చంద్రబాబు అరెస్ట్ విషయలో బీఆర్ఎస్ అనుసరించిన విధానంపై ఆ పార్టీపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ నేతలు వ్యక్తిగతంగా చంద్రబాబుకు సంఘీభావం చెబుతున్నా.. అదంతా ఓట్ల కోసం చేస్తున్న ప్రకటనలుగా భావిస్తున్నది. అందుకే బీఆర్ఎస్ను దెబ్బకొట్టేలా రాజకీయ వ్యూహాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.
చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో అధికార పార్టీకి ఎంతో కొంత నష్టం తప్పేలా లేదు. ఏపీ కి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ర్యాలీని అడ్డుకున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా చేస్తున్న సంఘీభావ కార్యక్రమాలను అడ్డుకోవడంపై బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీడీపీ శ్రేణులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ కు మేలు చేసేలా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారనే అనుమానాలు ఏపీ ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు సెటిలర్లు ఇప్పటికే సిద్ధం అయ్యారు.
ReplyForward
|