Jagan arrow : కర్ణాటకలో భారీ విజయంతో ఊపు మీదున్న కాంగ్రెస్ త్వరలో జరగబోయే ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నూ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నది. మొన్నటి వరకు తెలంగాణలో అస్తవ్యస్తంగా కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటున్నది. పార్టీని వీడి వెళ్లిన వారితో పాటు అధికార పార్టీ బీఆర్ఎస్ లో ప్రాధాన్యం దక్కని వారు, అసమ్మతి నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు సంబంధించిన కొందరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది.
షర్మిలపై కాంగ్రెస్ దృష్టి..
అయితే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్ టీపీ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాది నుంచి తెలంగాణ లో క్రియా శీలకంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలపై దూకుడుగా ముందుకు సాగుతున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఆ పార్టీ ఎదగడం లేదు. కర్ణాటక ఎన్నికలకు ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ షర్మిలపై దృష్టి సారించింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో షర్మిల వరుసగా భేటి అవుతున్నారు. వైఎస్సార్ టీపీ కాంగ్రెస్ లో విలీనం కాబోతున్నదన్న ఆరోపణలను షర్మిల ఖండిస్తూ వస్తున్నారు. ఒంటరి పోరు, క్యాడర్ లేమితో షర్మిల పునరాలోచనలో పడినట్లు తెలుస్తున్నది.
పొత్తా..విలీనమా?..
రాష్ర్ట విభజనతో ఏపీలో కాంగ్రెస్ ఉనికిలో లేకుండా పోయింది. ప్రస్తుత జోష్ తో ఏపీలోనూ పుంజుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ వైఎస్ షర్మిలను కాంటాక్ట్ అయినట్లు తెలుస్తున్నది. ఇటు తెలంగాణతో పాటు షర్మిలను ముందు పెట్టి ఆంధ్రాలోనూ తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవాని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఉమ్మడి రాష్ర్టంలో సీఎంగా వైఎస్సార్ పాలనలో ప్రజలు కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు. అయితే వైఎస్ఆర్ పేరు ఎంతో కొంత ఏపీలో తమకు లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నది. వైఎస్సార్ ఇమేజ్ ను వదులుకున్న కాంగ్రెస్ తిరిగి రెండు రాష్ట్రాల్లో సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నది. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిలతో మంతనాలు ప్రారంభించింది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చక్రం తిప్పారు. నేరుగా ప్రియాంక ద్వారా షర్మిలతో మాట్లాడించారు. పార్టీని విలీనం చేయాలని తెలంగాణలో గుర్తింపుతో పాటుగా ఏపీలో కీలక బాధ్యతలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీంతో షర్మిల పార్టీని విలీనం చేసుకోవడమా లేక పొత్తు పెట్టుకోవాలా అనే చర్చలు సాగుతున్నట్లు తెలుస్తున్నది. తొలుత షర్మిల విలీనం ప్రతిపాదనకు అంగీకరించలేదని, కానీ తెలంగాణలో పార్టీ మనుగడపై సన్నిహితులతో చర్చించిన తరువాత కాంగ్రెస్ ఆఫర్ ను అంగీకరిస్తే భావనలో షర్మిల ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇడుపులపాయకు ప్రియాంక..
కాంగ్రెస్ పార్టీని వీడి తమతో ఢీ అంటే ఢీ కొట్టి ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ పైన హస్తం పార్టీ గురి పెట్టింది. అందుకు షర్మిలను తమ బాణంగా జగన్ పైన ఎక్కు పెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఏపీలో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఢిల్లీలో రాహుల్, ప్రియాంక తో సమావేశం సమయంలో షర్మిల ఏపీకి సంబంధించి తన నిర్ణయం వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. జూలై 8న వైఎస్సార్ జయంతిన నివాళి అర్పించేందుకు ఇడుపులపాయకు ప్రియాంక గాంధీ రానున్నట్లు తెలుస్తున్నది. అక్కడే షర్మిల… వైఎస్సార్ ఘాట్ లోనే షర్మిల కాంగ్రెస్ తో తన భవిష్యత్ ప్రయాణంపై షర్మిల కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.