AP Politics :‘పగతో రగిలిపోతున్న నేత ఒకరు..’.. పగోడి కుమారుడు అని కూడా జాలిచూపకుండా జైలుకు పంపించిన నేత మరొకరు.. ఈ ఇద్దరి పంతాలు పట్టింపులకు ఆంధ్రప్రదేశ్ వేదికమైంది. రాజకీయం నరనరాన నింపుకున్న ఆ ఇద్దరు నేతల ధాటికి ప్రజానీకమే సమిధలు అవుతున్నారు. ఆ పార్టీ నేతలు బాధితులు అవుతున్నారు. జగన్ వర్సెస్ చంద్రబాబు ప్రతీకార రాజకీయంలో బాధితులు వారిద్దరే కాదు.. వీరి వెంట ఉన్న నేతలు.. వీరు పాలించిన ప్రజలు కూడా నష్టపోతున్న పరిస్థితి నెలకొంది.
-ప్రతీకార రాజకీయాలకు పురుడు పోసింది చంద్రబాబు, వైఎస్ఆర్ లే…
నిండు సభలో వైఎస్ఆర్, చంద్రబాబుకు పడేది కాదు. ఇద్దరూ కాంగ్రెస్ నుంచే రాజకీయం మొదలుపెట్టినా చంద్రబాబు తెలుగుదేశం పార్టీని టేకోవర్ చేసి వైఎస్ఆర్ కు ప్రత్యర్థిగా మారారు. వీరిద్దరూ లీడింగ్ పొజిషన్ లో పార్టీలను నడిపించారు. అయితే చంద్రబాబు సీఎంగా ఉండగా వైఎస్ఆర్ ప్రతిపక్ష నేతగా చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే సీఎం అయ్యాక చంద్రబాబుపై ఎన్నో కేసులు, కమిషన్లు వేశారు. కానీ వ్యవస్థలను బలంగా మేనేజ్ చేయడంలో కింగ్ గా ఎదిగిన చంద్రబాబు తన 45 ఏళ్ల రాజకీయంలో ఏ ఒక్క కేసులోనూ దొరకలేదు. అన్నింట్లోనూ స్టేలు తెచ్చుకున్నారు. దీంతో నాటి వైఎస్ఆర్ పగ నెరవేరలేదు. ఇక వైఎస్ఆర్ మరణించాక చంద్రబాబులోని పగ ప్రతీకారం నెరవేరింది. రోశయ్యను సీఎం చేయడం.. జగన్ ను పక్కన పెట్టాక కాంగ్రెస్ తో కలిసి చంద్రబాబు వేసిన ప్రతీకార రాజకీయ ఎత్తులు వైఎస్ కుటుంబాన్ని ఏకాకిని చేశాయి. కోర్టుల్లో ఇంప్లీడ్ అయ్యి మరీ జగన్ ను జైలుకు పంపడంలో చంద్రబాబు ప్రమేయం కాదనలేదు. జగన్ ను 16 నెలలు జైలు పాలు చేసిన వారిలో కాంగ్రెస్ తోపాటు చంద్రబాబు ప్రమేయం కూడా ఉంది. ఆ జైలు జీవితమే జగన్ ను కరుడు గట్టిన పొలిటీషియన్ గా మార్చింది. అందుకే తనను జైలుకు పంపిన చంద్రబాబును వదల బొమ్మాళి అంటూ జగన్ పగబట్టాడు. ప్రతీకారంతో ఊగిపోతున్నాడు.
-2014లోనూ అదే కథ
2014 ఉమ్మడి ఏపీ విడిపోయాక అవిభాజ్య ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యారు. నాడు ప్రతిపక్ష నేతగా జగన్ ను అసెంబ్లీలో, బయట కూడా వెంటాడాడు ఇదే చంద్రబాబు. రోజా లాంటి వారిని అసెంబ్లీలోకే అడుగుపెట్టనీయలేదు. ఇక వైఎస్ఆర్ కుటుంబంపై కూడా నాడు అసెంబ్లీలో అచ్చెన్నాయుడు తదితర ఎమ్మెల్యేలు తూలనాడారు. అవమానకరంగా మాట్లాడారు. ఒకనొక దశలో గెలిచాక అసెంబ్లీలోకి వస్తానంటూ జగన్ శపథం చేశాడు. ఇక గద్దెనెక్కగానే చంద్రబాబు చేసిన దారుణ పని ఏంటంటే.. వైసీపీ తరుఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కోవడం.. లేదా కొనుక్కోవడం.. ఏకంగా అఖిలప్రియ లాంటి వైసీపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి కూడా కట్టబెట్టడం.. ఇవన్నీ జగన్ పై దారుణంగా చంద్రబాబు కొట్టిన దెబ్బలే. అవే జగన్ లో పగకు, ప్రతీకారానికి కారణమయ్యాయి.
-చంద్రబాబుపై పగతో రగిలిపోతున్న జగన్
అందుకే గద్దెనెక్కగానే జగన్ 45 ఏళ్ల పొలిటీషియన్ అయిన చంద్రబాబును వేటాడుతున్నాడు. వెంటాడుతున్నాడు. ప్రతీకారేచ్ఛతో మొత్తం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబుకు బెయిల్ రాకుండా నెలరోజులకు పైగా జైల్లో ఉంచాడు. ఇప్పటికీ చంద్రబాబుకు బెయిల్ రాకుండా ఢిల్లీ స్తాయిలో జగన్ చేస్తున్న లాబీయింగ్.. బీజేపీతో సంప్రదింపులు చూస్తుంటే చంద్రబాబుకు మరిన్ని కష్టాలు ఖాయమని.. లోకేష్ ను అరెస్ట్ చేసి టీడీపీని కకావికలం చేసి గెలవాలని జగన్ స్కెచ్ గీస్తున్నట్టు తెలుస్తోంది.
-చంద్రబాబు వర్సెస్ జగన్ తో నష్టపోతున్న ఆంధ్ర
ఇద్దరూ జనాలకు ఏదో చేస్తామని గద్దెనెక్కారు. అనుభవం ఉన్న చంద్రబాబును 2014లో గెలిపిస్తే ఆయన 5 ఏళ్లలో అమరావతి పూర్తి చేయలేదు. ఇప్పుడు అదే జగన్ కు వరమై అందులో లూప్ హోల్స్ వెతికి చంద్రబాబును జైలుకు పంపుతున్నారు. ఏపీ రాజధాని అమరావతి నుంచి విశాఖకు మారుస్తున్నారు. దీనివల్ల అమరావతిలో భూములు కోల్పోయిన రైతులు, పెట్టుబడులు పెట్టిన రంగాల నిపుణులు నష్టపోతున్నారు. ఏపీకి వచ్చిన విదేశీ పెట్టుబడులు జగన్ మార్పిడి రాజకీయాలతో ఆగిపోయాయి. చంద్రబాబు పాలనను కంటిన్యూ చేయక అవన్నీ రద్దు చేస్తూ పాలించడం వల్ల ఏపీ క్రెడిబిలిటీ పోయింది. ఉద్యోగం, ఉపాధి కరువైంది. జనాలకు మౌళిక సౌకర్యాల కల్పన, ఉద్యోగ ఉపాధి దూరమైంది. వీరి ప్రతీకారం రాజకీయం వల్ల ఖచ్చితంగా నష్టపోయింది ఏపీ ప్రజానీకమే.
– రాష్ట్ర ప్రజానీకం ఎలాంటి పరిపాలనలో ఉన్నారు? ఏ పరిస్థితులలో రాష్ట్రం ఉంది?
చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేలను, నేతలను లాక్కొని ఆ పార్టీని దెబ్బతీశారు. ఇప్పుడు జగన్ ఏకంగా చంద్రబాబునే దెబ్బ తీస్తున్నారు. తన రౌడీ రాజకీయంతో ఎలుగెత్తిన వారిపై రౌడీల్లో వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. వైసీపీ పాలనలో దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్న అపవాదు ఉంది. చంద్రబాబు నాడు ఐదేళ్లలో అభివృద్ధి పనులు, పోలవరం వంటివి పూర్తి చేయలేదు. ఇప్పుడు వాటిని పూర్తి చేసే పనిలో జగన్ లేడు. రాజధాని సహా అన్నీ మార్చేస్తున్నారు. ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఏపీకి రాకుండా చేసింది. మద్యం విధానంతో ఏపీ ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారు జగన్. నిజానికి ఈ నకిలీ మద్యం బ్రాండ్ కు అనుమతులు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. ఇలా ఎన్నో కారణాలు .. రాష్ట్రంలో వీరిద్దరి పాలనతో ఓ 10 ఏళ్లు వెనక్కిపోయింది. పక్కనున్న తెలంగాణలో సుస్థిర పాలనతో అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఏపీలో మాత్రం జగన్ వర్సెస్ చంద్రబాబు రాజకీయంలో చితికిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.