Kishan Reddy : తెలంగాణలో ఇక జనసేనతో పొత్తులు ఉండవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తాజాగా ప్రకటించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, సింగిల్ గానే బరిలో నిలుస్తుందని స్పష్టం చేశారు. సర్వేలకు అందని విధంగా లోక్ సభ ఫలితాలు ఉంటాయని తెలిపారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన అనుకోలేదు. పార్టీ తరపున ఒంటరిగా 32 స్థానాల్లో బరిలోకి నిలువాలనుకున్నారు. కానీ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ రాయబారం పేరిట పవన్ ఇంటికి వచ్చి మరీ ఆయన్ను ఒప్పించారు. జనసేనకు కేవలం 8 సీట్లు ఇచ్చారు. తెలంగాణలో పవన్ ఇమేజ్ తమకు కలిసివస్తుందని బీజేపీ నేతలు భావించారు. అయితే వారి వ్యూహం బెడిసికొట్టింది. జనసేనతో పొత్తు వల్ల ఇరుపార్టీలకు ఏమాత్రం మేలు జరుగలేదు.
జనసేన పోటీ చేసినా 8 చోట్ల బీజేపీ కార్యకర్తలు మద్దతు ఇవ్వలేదని ఆ పార్టీ క్యాడర్ ఆరోపిస్తోంది. సంప్రదాయ బీజేపీ ఓటు బ్యాంకు కూడా జనసేనకు పడలేదని అంటున్నారు. తాండూరులో గతంలో బీజేపీకి 10వేల ఓట్లు వచ్చాయని.. మరి ఆ ఓట్లు మొన్న ఎటు పడ్డాయో ఎవరికీ తెలుసు అని ఆరోపిస్తున్నారు. అలాగే కూకట్ పల్లిలోనూ ఏమాత్రం సహకారం అందలేదు. జనసేనతో పొత్తు లేదని చెప్పుకోవడానికే బీజేపీ ప్రాధాన్యం ఇస్తోందని, అదే మంచిది అని తమకు కూడా ఓ ఒత్తిడి తొలగిపోయిందని జనసేన వర్గాలు చెపుతున్నాయి.