Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే గ్యాంగ్ స్టర్ ఓ హత్య కేసులో 17 ఏళ్లు జైలుశిక్ష అనుభవించి గత ఏడాది విడుదలయ్యాడు. అయితే, తాజాగా అతడు లోక్ సభ ఎన్నికల్లో ఆర్జేడీ తరపున ముంగేర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ చట్టపరంగా అడ్డంకులు రావడంతో పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సూచన మేరకు లేటు వయసులో అనితా కుమారి (46) అనే మహిళను గుడిలో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను ఎన్నికల బరిలో నిలుపనున్నారు.
నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన ‘ఖాకీ’ గుర్తుండే ఉంటుంది. అందులో ఒక కరడుకట్టిన నేరగాడి ఆగడాలు, అతనిని పట్టుకున్న వైనాన్ని తెలుపుతూ బీహార్ ఐపీఎస్ అధికారి అమిత్ లోదా వ్యూహాలపై ఓ పుస్తకం కూడా వచ్చింది. దీని ఆధారంగానే ‘ఖాకీ’ వెబ్ సిరీస్ నిర్మించారు. ఈ సిరీస్ మొత్తం అశోక్ మహతో జీవితం ఆధారంగా రూపొందించిందే అనడంలో సందేహం అక్కర లేదు.