Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్ బ్యాలెట్ లో జరిగిన తప్పిదంపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. నాదెండ్ల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వరకుమార్ ను ఎన్నికల విధుల నుంచి తొలగించారు. రిటర్నింగ్ అధికారి నారదమునికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆయా ఉద్యోగులు మళ్లీ 8, 9 తేదీల్లో ఓటేయాలని సూచించారు.
ఆదివారం చిలకటూరిపేట నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. అయితే, పోస్టల్ బ్యాలెట్ ఓటు బదులు ఈవీఎంలో పెట్టే బ్యాలెట్ ను ఉద్యోగులకు ఇవ్వడంతో వారందరు దానిపైనే ఓటు వేశారు. అధికారుల తప్పిదం కారణంగా 1,219 మంది ఉద్యోగుల ఓట్లు ప్రశ్నార్థకమయ్యాయి. ఓటింగ్ పూర్తయిన తర్వాత గుర్తించిన అధికారులు ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనాకు జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చారు. ఈ విషయంపై టీడీపీ నేతలు వర్ల రామయ్య, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు సీఈఓను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నారు.