Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చింది. మేడిగడ్డలో ఏడో బ్లాకుకు మాత్రమే నష్టం వాటిల్లిందా, మిగిలిన బ్లాకుల పరిస్థితి ఏంటో తెలుసుకునేందుకు పలు పరీక్షలు చేయాల్సి ఉంది. తుది నివేదికను జూన్ లో అందజేస్తామని నీటిపారుదల శాఖ అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఈ బ్యారేజీలను పరిశీలించింది. దీంతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు, ఏజెన్సీలతో చర్చలు నడిపింది. పూర్తి నివేదిక రావడానికి సమయం పట్టే అవకాశం ఉండడం.. వర్షాకాలంలోగా తాత్కాలిక మరమ్మతులు చేయాలని సూచించింది. లేకపోతే బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని తెలిపింది. దీనికి అనుగుణంగా అయ్యర్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన సిఫార్సులతో మధ్యంతర నివేదికను ఎన్డీఎస్ఏ ఛైర్మన్.. రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శికి పంపినట్లు తెలిసింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి సూచించింది. ప్రాజెక్టులో దెబ్బతిన్న పిల్లర్లకు మాత్రమే కాకుండా మిగిలిన వాటికీ ప్రమాదం లేదనుకోలేమని స్పష్టం చేసింది. మొత్తం 85గేట్లలో 77 గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని మిగిలిన ఎనిమిది గేట్లలో మాత్రం సాంకేతిక , మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాటికి మరమ్మత్తులు ఏవిధంగా చేపట్టాలో అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ రిపేర్ లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ టెక్నికల్ పద్దతిన మరమ్మత్తులు చేపట్టాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకులో 15నుంచి 22 పిల్లర్లు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. వాటిని రిపేర్ చేసేందుకుగాను గేట్లను పైకి ఎత్తివేయాలని, 20, 21 నెంబర్ గేట్లను ఓపెన్ చేయడానికి వీలు లేనందున వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే, 8 గేట్ల ప్రాంతంలో బ్యారేజీ మీదనున్న శ్లాబ్ కుంగిపోవడంతో కొత్త శ్లాబ్ వేయాలన్నారు.
కమిటీ సమర్పించిన సమర్పణల ఆధారంగా.. ఈ బ్యారేజీలకు సంబంధించి రానున్న రుతుపవనాలు ప్రారంభానికి ముందు నీటిపారుదల శాఖ చేపట్టాల్సిన మధ్యంతర చర్యలు, తదుపరి అధ్యయనాలు, పరిశోధనలపై సిఫార్సులు చేసింది. బ్యారేజ్ ప్రారంభమైన తర్వాత మొదటి దఫా వరదతో మేడిగడ్డలోని ఏడో బ్లాక్ లో తలెత్తిన సమస్యలను గుర్తించి మరమ్మత్తులు చేసి ఉంటే మిగతా పిల్లర్లకు సమస్యలు వచ్చేవి కావని అధికారులు పేర్కొన్నారు. నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నెలకొందన్నారు. మరమ్మత్తుల సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు