PM Modi : ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి మోదీ తాజాగా ఓ పండ్ల వ్యాపారిని కలిసి మాట్లాడారు. కర్ణాటకలోని సిరసి పర్యటనకు వెళ్లిన ప్రధాని.. అక్కడ స్థానికంగా పండ్లు విక్రయించే మోహినీ గౌడ అనే మహిళతో ముచ్చటించారు. స్వచ్ఛ భారత్ కోసం ఆమె చేస్తున్న పనిని కొనియాడారు.
మోహిని గౌడ స్వస్థలం ఉత్తర కన్నడ జిల్లా అంగోలాకు చెందిన హాలక్కి ప్రాంతం. అంగోలా బస్టాండ్ లో ఆమె బుట్టలో పండ్లు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అందరిలాగా కవర్లలో కాకుండా ఆకుల్లో పండ్లను పెట్టి అమ్ముతున్నారు. కొందరు ప్రయాణికులు పండ్లను కొని తిన్న తర్వాత ఆకులను అక్కడే పడేసి వెళ్లిపోవడం మోహిని గమనించారు. ఆమె ఆ వ్యర్థాలను తానే సేకరించి చెత్తబుట్టలో వేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆదర్శ్ హెగ్డే అనే వ్యక్తి ఆమె చేస్తున్న పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరలయింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆ వీడియోను రీపోస్ట్ చేస్తూ ఆమెను ప్రశంసించారు.