Telangana Rains : మండే ఎండలతో నిప్పుల కుంపటిని తలపించిన తెలంగాణ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్న రాష్ట్ట వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వర్షం కురిసింది. అయితే ఈదురుగాలులతో కూడిన వర్షాలతో మామిడిపంటకు తీవ్ర నష్టం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతులు నష్టపోయారు. హైదరాబాద్ లోనూ వర్ష బీభత్సం కొనసాగింది.
కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులతో పాటు జోరువాన కురిసింది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో సీఎం రేవంత్ రెడ్డి సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో సీఎం కరీంనగర్ పర్యటన రద్దు చేశారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది.
వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షంతో వర్ధన్నపేట మండలం కటిర్యాల శివారులో జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో కొనుగోలు కేంద్రంలో నిలువచేసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. బుధవారం ప్రధాని పర్యటన కోసం ఏర్పాటు చేసిన సభ టెంట్లు, కుర్చీలు చెల్లాచెదరయ్యాయి.