Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అవకతవకలు జరిగాయని చంద్రబాబుపై సీఐడీ పలు అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరుపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ పై తీర్పు రిజర్వ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక పరిణామం జరిగింది. టీడీపీ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో పలు అక్రమాలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో స్వార్థ ప్రయోజనాల కోసమే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మూడుసార్లు మార్చారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.
అలైన్ మెంట్ మార్పు ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ క్విడ్ ప్రోకు పాల్పడ్డారని పేర్కొంది. అలైన్ మెంట్ మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కలిగించారని వివరించింది. క్విడ్ ప్రో కిందే చంద్రబాబుకు కరకట్టపైన ఉన్న తన భవనం చంద్రబాబుకు అప్పగించారని సీఐడీ ఆరోపిస్తోంది.
రీసెంట్ గా ఈ కేసులో సీఐడీ మెమో దాఖలు చేసింది. దర్యాప్తు అధికారులను లోకేశ్ రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారని సీఐడీ మెమోలో పేర్కొంది. చంద్రబాబు కేసులను విచారిస్తున్న అధికారులపై లోకేశ్ రెడ్ బుక్ చూపించి బెదిరిస్తున్నట్టు కోర్టులో మెమో ద్వారా వివరించింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరింది.
దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులను కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీనిపై చంద్రబాబు తరపు న్యాయవాదులు లిఖిత పూర్వక వాదనలు వినిపించారు. లోకేశ్ చేసిన వ్యాఖ్యలు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ కు సంబంధం లేదని కోర్టుకు నివేదించారు. సీఐడీ మెమోను పరిగణలోకి తీసుకోవద్దని, రింగ్ రోడ్డు కేసు గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదని వివరించారు.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ప్రస్తావన సీఐడీ మెమోలో దాఖలు చేయడం మినహా.. ఎక్కడా ప్రస్తావించలేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు చెప్పుకొచ్చారు. దీంతో వీటిని పరిశీలించిన న్యాయస్థానం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పైన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
ఇక సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. వాదనలు పూర్తయిన తర్వాత సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. సుప్రీం ఇవ్వనున్న ఆ తీర్పు చంద్రబాబు కేసుల్లో కీలకం కానుంది. దీంతో సుప్రీం క్యాష్ పైన ఎలాంటి తీర్పు ఇస్తుందనే టెన్షన్ కొనసాగుతోంది.