AP News : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ. 2.40 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్ పోస్టు వద్ద గురువారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును తనిఖీ చేశారు. బస్సులో అక్రమంగా తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేసినట్లు దేవరపల్లి సీఐ బాలసురేష్ బాబు తెలిపారు.
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో 100 కోట్ల రూపాయలపైగా విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు ఇటీవల వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ డబ్బు, మద్యం మొదలగునవి పట్టుబడుతూనే ఉన్నాయి.