Telangana BJP : తెలంగాణ బీజేపీలో కలకలం రేగింది. పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అధ్యక్ష పదవి లేదంటి ఫ్లోర్ లీడర్ ఇవ్వాలంటూ ఇదివరకే ఆయన అగ్రనేతలను కలిశారు. ఆ తర్వాత ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నానని పేర్కొన్నారు. పార్టీలో క్రియాశీలక నేతగా ఉన్న తను అధ్యక్ష పదవికి అర్హుడిని కాదా అంటూ ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో తన కులమే తనకు శాపంగా మారుతోందన్నారు. 2 నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తందన్నారు. దుబ్బాక నుంచి మరోసారి కూడా ఎమ్మెల్యేగా గెలుస్తానని స్పష్టం చేశారు. నాకెవరూ సాయం చేయలేదని, కానీ మనుగోడు ఎన్నికల్లో గెలిచేందుకు రూ. 100 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. అవే వంద కోట్లు తనకు ఇస్తే తెలంగాణను దున్నేసేవాణ్ణి అంటూ చెప్పుకొచ్చారు. దుబ్బాకలో తనను చూసే ప్రజలు గుర్తించారని స్పష్టం చేశారు.
అయితే పార్టీ రాష్ర్ట అధ్యక్షుడి మార్పు పై కూడా రఘునందన్ రావు స్పందించారు. అది నిజమేనని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ ది స్వయంకృతాపరాధం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేశారని గతంలో చెప్పారని గుర్తు చేశారు. అలాంటి సంజయ్ రూ. 100 కోట్లతో యాడ్స్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తరుణ్ చుగ్ , సునీల్ బన్సల్ బొమ్మలతో ఓట్లు రావని, రఘునందన్, ఈటల బొమ్మలతోనే ఓట్లు వస్తాయని చెప్పారు. ఎన్నికల్లో పార్టీ అనేది చివరి అంశమేనని, అభ్యర్థులే కీలకమని స్పష్టం చేశారు. పార్టీకి అసెంబ్లీ పక్ష నేత లేడనే విషయం కూడా జాతీయ అధ్యక్షుడు నడ్డా కు తెలియదని పేర్కొన్నారు. వారి దృష్టికి తీసుకెళ్తే ఆశ్చర్య పోయారని పేర్కొన్నారు. తన సేవకు ప్రతిఫలం రాకపోతే నడ్డాపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే రఘునందన్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనమయ్యాయి. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటున్న బీజేపీ, ఒక్కసారిగా మీడియాలో ఇప్పుడు వార్తయ్యింది. అయితే రాహుల్ గాంధీ పర్యటన పై రాష్ర్టంలో చర్చ నడవకూడదనే బీజేపీ ఈ గేమ్ మొదలు పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అయితే దుబ్బాక ఎమ్మెల్యేగా, మంచి వాగ్ధాటి ఉన్న నేతగా రఘునందన్ రావు రాష్ర్ట ప్రజలందరికీ సుపరిచితుడే. ఆయనే ఇప్పుడు ఒక రేంజ్ లో పార్టీ పై తిరుగుబాటు చేసినంత పని చేశారు. పార్టీ రాష్ర్ట అధ్యక్షుడిపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏకంగా వందకోట్లు ఎక్కడివంటూ ఆ యనను ఇరకాటంలో పడేశారు. అయితే కొంతకాలంగా రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ మీద అధిష్టానానికి తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఇటీవల ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి రాష్ర్టంలో పార్టీ పరిస్థితిపై మాట్లాడారు. కొన్ని రోజులుగా రాష్ర్టంలో అధ్యక్షుడి మార్పుపై కథనాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా పార్టీకి చెందిన క్రియాశీలక ఎమ్మెల్యే బాహాటంగానే అధ్యక్షుడిపై విరుచుకుపడ్డారు. ఇక బండి సంజయ్ ని బాధ్యతల నుంచి తొలగించడం ఖాయమని తెలుస్తున్నది. ఇక రఘునందన్ వ్యాఖ్యలు ఇటు బీజేపీ శ్రేణులు కూడా అయోమయంలో పడ్డాయి. బండి సంజయ్ కి వ్యతిరేకంగా ఇటీవల పలు ప్రాంతాల్లో సమావేశాలు కూడా జరిగాయి. ఆయన వ్యవహారశైలి నచ్చని వారంతా ఏకమయ్యారు. అధిష్టానంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏకంగా రఘునందన్ రావే రంగంలోకి దిగారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఖాయమనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి స్పష్టంగా వినిపిస్తున్నది.
ReplyForward
|