Sharmila Son Marriage : వైఎస్ షర్మిల-బ్రదర్ అనిల్ కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం జోధ్పూర్లో జరిగింది. ఈ వేడుకకు ఇరు వైపుల కుటుంబ పెద్దలు, స్నేహితులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కానీ, మామ, సీఎం జగన్ మాత్రం వెళ్లలేదు.
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. జోధ్పుర్లో ఆకాశాన్నంటే మండపాలు, నేలను తలపించే పీటలతో ఆనందంగా రాజారెడ్డి, ప్రియా వివాహ క్రతువు జరిగింది.
నూతన వధూ వరులను వైఎస్ షర్మిల-బ్రదర్ అనిల్ దంపతులు, ఇటు ప్రియా అట్లూరి తల్లిదండ్రులు, షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ ఆశీర్వదించారు. కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగింది. జగన్ మాత్రం హాజరవ్వలేదు.
జగన్ గానీ.. ఆయన భార్య భారతి గానీ.. వేడుకల్లో కనిపించలేదు. జయమ్మ మాత్రమే వెళ్లారు. ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల.. తన అన్న జగన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే వివాహానికి వెళ్లద్దని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
రాజారెడ్డి, ప్రియా నిశ్చితార్థం 2024, జనవరి 18వ తేదీ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్ లో జరిగింది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా వెళ్లి జంటను ఆశీర్వదించారు. వైఎస్ జగన్ వెళ్లినా.. ఎక్కువ సేపు ఉండలేదు.
నాలుగేళ్లుగా రాజారెడ్డి, ప్రియా అట్లూరి ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లో తెలిసింది. ఇటు షర్మిల, అనిల్ దంపతులు.. అటు ప్రియా కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించడంతో వివాహ వేడుక జరిగింది.
షర్మిల కుమారుడు రాజారెడ్డి డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశాడు. యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నారు. గతంలో జరిగిన ఆ కార్యక్రమానికి షర్మిల కూడా వెళ్లారు.