రైల్వే శాఖ శ్రీవారి దర్శనానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. దీంతో ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. కరీంనగర్, వరంగల్ మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు నడుపుతోంది. ఇక మీదట ప్రయాణికులకు కష్టాలు తప్పనున్నాయి. సుదూర ప్రయాణం కావడంతో ఇన్నాళ్లు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక మీదట ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రతి గురువారం కరీంనగర్ నుంచి రైలు బయలుదేరి తిరుపతి చేరుకుంటుంది.
ఈ మేరకు రైల్వే శాఖ ప్యాసింజర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ఐఆర్ సీటీసీ టూరిజం కింద సప్తగిరి పేరుతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాల మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది. మూడు రాత్రులు, నాలుగు రోజుల టూర్ కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది.
ప్రతి గురువారం ఈ టూర్ ప్యాకేజీ కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి సాగనుంది. ఐఆర్ సీటీసీ సప్తగిరి టూర్ ప్యాకేజీ పర్యాటకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది. గురువారం రాత్రి కరీంనగర్ లో 7.15 గంటలకు బయలుదేరిన రైలు 8.05 గంటలకు పెద్దపల్లి, 9.15 గంటలకు వరంగల్, 11 గంటలకు ఖమ్మం చేరుకుంటుంది. రెండో రోజు ఉదయం 7.50 గంటలకు తిరుమల చేరుకుంటుంది.
తరువాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల సందర్శన అనంతరం అక్కడే బసచేయాలి. మరునాడు మూడో రోజు రాత్రి 8.15 గంటలకు బయలుదేరి రాత్రంతా ప్రయాణించాలి. నాలుగో రోజు ఉదయం 8.40 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. దీన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.