TDP alliance Win : రాబోయే ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ యువతకు బంగారు భవిష్యత్ అందించే బాధ్యత తీసుకుంటారన్నారు. ఈ సందర్భంగా జగన్ సర్కారుపై విమర్శలు చేశారు. అవినీతి సీఎంను ఇంటికి సాగనంపాలని సూచించారు. కూటమి ఘన విజయం సాధిస్తుందని చంద్రబాబు ధీమాగా ఉన్నారు. మూడు పార్టీల ప్రభంజనంలో జగన్ పార్టీ కొట్టుకపోవడం ఖాయమని ఆయన అంటున్నారు. ఉమ్మడి మ్యానిఫెస్టోలోని అంశాలే తమను గెలిపిస్తాయని బలంగా నమ్ముతున్నారు.
ఈ నేపథ్యంలో నెల్లూరులోని నర్తకి సెంటర్ లో పవన్ కల్యాణ్ తో కలిసి ప్రచారం నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు..పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తామన్నారు. జగన్ తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేస్తామన్నారు. రూ. 13 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని దుయ్యబట్టారు. ఆదాయం పెంచకుండా ఖర్చులు విపరీతంగా పెంచేశారు. అధికారంలోకి రాగానే ఇష్టారాజ్యంగా అప్పులు పెంచి రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ గా చేశారని వాపోయారు.
ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తో పట్టాదారు పాసు పుస్తకం ఉండదని, దస్తావేజులు కూడా ఉండవని చెబుతున్నారు. ఇలా పేదలను నిరంతరం భయభ్రాంతులకు గురిచేసే పనికి రాని చట్టాలు తీసుకొచ్చి వారిలో భయం నింపుతున్నారని దుయ్యబట్టారు. జగన్ నియంత పాలనలో ప్రజలు విసిగిపోయారు.
ప్రస్తుతం భూములు అమ్మాలన్నా కొనాలన్నా జగన్ అనుమతి తీసుకోవాలి. ప్రజల ఆస్తులపై ప్రభుత్వ అజమాయిషీ ఏమిటని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డీఎస్సీ మీదే ఉంటుందన్నారు. రెండో సంతకం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దుపై చేస్తానన్నారు. ముస్లింల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తానన్నారు. ఇలా జగన్ ఆగడాలను అడ్డుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
నెల్లూరు-తిరుపతి-చెన్నై ట్రై సిటీగా మారుస్తామన్నారు. ఎలక్ట్రానిక్ హబ్, హార్డ్ వేర్ గా తీర్చిదిద్దుతామన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కట్టిన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకున్నారని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వస్తే 48 వేల ఇళ్లు అందజేస్తామని ధీమా వ్యక్తం చేశారు.