Telangana: తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ పార్టీలన్నీ చేరికల మీద దృష్టి పెట్టాయి. అయితే తెలంగాణలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ , కాంగ్రెస్ లలో కి చేరికలు పెరిగాయి. అయితే బీఆర్ఎస్ పార్టీని చూసుకుంటే గతంలో 80శాతం మంది తెలుగు దేశం లో ఉన్న నేతలే ఇక్కడా కనిపిస్తారు. మిగతా కొందరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి చేరారు. సీఎం కేసీఆర్ సహా ఆయన మంత్రివర్గంలోని ముఖ్య నేతలంతా గతంలో తెలుగు దేశం పార్టీలో వివిధ హోదాల్లో పని చేసినవారే. ఒక దశలో టీటీడీపీ అనే పేరుగా సరిగ్గా సరిపోయేలా ఆ పార్టీ కనిపిస్తున్నది.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా అదే పరిస్థితి. టీపీసీసీ చీఫ్ కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే. ఇప్పుడు కొత్తగా మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే. అయితే ఇప్పుడు మిగిలిన టీటీడీపీ లీడర్లు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు కనిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సారథ్య బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్సే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం ఏర్పడింది.
మధ్యలో బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కొంత హవా కొనసాగించినా, ప్రస్తుతం ఆయనను బాధ్యతల నుంచి తప్పించారు. బీజేపీ కూడా పూర్తిగా సైలెంట్ అయ్యింది. ఇక అందరి చూపు కాంగ్రెస్ వైపు మళ్లింది. రేవంత్ రెడ్డి కూడా తన పాత మిత్రులను మళ్లీ తనవైపు తిప్పుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా మైనంపల్లి, తుమ్మల సహా మరికొందరు నేతలతో కూడా ఆయన అనుయాయులు టచ్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తున్నది. ఒకనోక దశలో పట్నం మహేందర్ రెడ్డి పేరు కూడా కనిపించింది. అయితే ఆయనకు మంత్రి పదవి ఇస్తారనే టాక్ నేపథ్యంలో ఇప్పుడు ఆయన కొంత వెనక్కి తగ్గినట్లుగా సమాచారం. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ గూటికి చేరేవారు ఎందరు ఉన్నారు. వారితో ఆ పార్టీకి నష్టమా.. లాభమా అనేది త్వరలోనే తేలనుంది.