Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ వేలు పెడుతుందా అంటే అవుననే వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ ఆ పార్టీ అధినేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జగన్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లు చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలిస్తే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగిస్తారు’ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)తో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుణపాఠం చెబుతారని ఒవైసీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ముస్లిం సామాజిక వర్గానికి కల్పించిన రిజర్వేషన్లు మతం ఆధారంగా కాకుండా సామాజిక, ఆర్థిక ప్రమాణాలపై ఆధారపడి ఉన్నాయని స్పష్టం చేశారు.
గోషామహల్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఓవైసీ బుధవారం (మే 1) మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ వైఖరిని వ్యతిరేకించాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. జగన్ ఎన్నికల్లో విజయం సాధిస్తారని, ముస్లిం రిజర్వేషన్లకు మద్దతిస్తూనే ఉంటారని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
దేశంలో మత, భాషా, సంస్కృతిక మైనారిటీల హక్కులను పరిరక్షించే ఆర్టికల్ 29, 30ను తొలగించడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అసదుద్దీన్ ఆరోపించారు.
మైనారిటీలు నివసిస్తున్న హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో తమిళనాడు వంటి రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు విద్యా సంస్థలను స్థాపించేందుకు ఈ ఆర్టికల్స్ వీలు కల్పిస్తాయని ఆయన చెప్పారు. ఈ కీలకమైన రాజ్యాంగ నిబంధనలను తొలగించడమే మోదీ, అమిత్ షా లక్ష్యమని ఒవైసీ విమర్శలు గుప్పించారు.
అయితే, అసదుద్దీన్ జగన్ కు మద్దతివ్వడంతో హిందువుల ఓట్లు ఇబ్బందుల్లో పడవచ్చని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.