BJP కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలకు తాము దూరమని, వాటిని ప్రోత్సహించమని చెప్పే బీజేపీ కూడా అదే దారిలో పయనిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్ష పార్టీలపై ఎక్కుపెట్టే మొదటి విమర్శ ఇదే. రాచరిక పాలనను వద్దంటూ నీతులు చెప్పే బీజేపీ నేతలు ఇప్పుడు అదే దారిలో వెళ్తున్నట్లుగా కనిపిస్తున్నది.
ఇతర పార్టీలకు తామేమీ తీసిపోలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ తరచూ ముఖ్యమంత్రులను మార్చడం, కేంద్ర మంత్రులను మార్చిన విషయం తెలిసిందే.
ఇటీవల బీజేపీ కేంద్ర న్యాయశాఖ మంత్రిని తప్పించి మరొకరిని అందులో కూర్చోబెట్టింది. కాంగ్రెస్ బాటలోనే నడుస్తున్నట్లు విమర్శలు వచ్చాయి.
ఇప్పడు అదే తరహాలో కుటంబ పాలన, వారసత్వాలకు దూరమంటూ చెప్పుకొచ్చిన భారతీయ జనతా పార్టీ కూడా అదే దారిలో వెళ్తున్నది.
దివంగత నేత సుష్మా స్వరాజ్ కూతురును ఢిల్లీ రాజకీయాల్లో బీజేపీ నేతలు ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ బీజేపీ కార్యదర్శిగా పదవి అప్పగించారు. అంతటితో ఆగకుండా విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నారు. ఢిల్లీ బీజేపీకి ఆమెనే భవిష్యత్ అన్నట్లుగా ఇప్పటి నుంచే హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆమెకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఢిల్లీ బీజేపీకి గ్లామర్ నేతల కొరత ఉన్నది. ఆ కొరతను సుష్మా స్వరాజ్ కుమార్తె తో భర్తీ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఢిల్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సుష్మస్వరాజ్ కుమార్తె కు అవకాశం ఇవ్వడం ద్వారా ఢిల్లీపై మరింత పట్టు సాధించవచ్చని బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తునన్నది.
అయితే ఒక్కో అడుగుతో ఆమెను ఎలివేట్ చేస్తున్నారు. ముందుగా ఆమెను బీజేపీ లీగల్ సెల్ లో చేర్చారు. ఇప్పుడు బీజేపీ ఢిల్లీ కార్యదర్శిగా అవకాశం ఇచ్చారు.
బీజేపీలో అగ్రనేతల వారసులు ఇప్పటికే తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. కేంద్ర హోమంత్రి అమిత్ షా కుమారుడు ఏకంగా బీసీసీఐని గుప్పిట్లో పెట్టుకున్న విషయం తెలిసిందే. రాజ్ నాథ్ సింగ్ నుంచి అమిత్ షా వరకూ తమ వారసులను పరోక్షంగా తెరమీదికి తీసుకు వస్తున్నారు.
ఇంత జరుగుతున్నా బయటి ప్రపంచానికి వారి వెనుక సంగతులు తెలియదనుకోవడం వారి అవివేకానికి నిదర్శనంగా నిలుస్తున్నది. వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని… తామే వాటిని నిరోధిస్తామని చెప్పే బీజేపీ నేతలు ఇక నుంచి విమర్శలు ఎలా చేస్తారో చూడాల్సిందే.