Rythu Bandhu : ఎన్నికలు సమీపించగానే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ఐదెకరాల పైబడి ఉన్న రైతులందరికీ రైతుబంధు నిధులు జమచేశారు. దింతో ఒక్కసారిగా ప్రతిపక్షాలు రైతు బందు కోసం నోరు మెదపకుండా అయ్యింది. నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో క్రెడిట్ ఎవరికీ దక్కుతుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైనది. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కేసీఆర్ తనదయిన శైలిలో రాజకీయ మాటలకూ తెరలేపారు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో రైతులకు నిధులు అందుతుండగా ఆ క్రెడిట్ ను తన ఖాతాలో కేసీఆర్ వేసుకోడానికి రాజకీయంగా ఉపయోగిస్తున్నారు. ఇది బిఆర్ఎస్ విజయంగ ప్రచారం చేసుకుంటున్నారు. బిఆర్ఎస్ సీఎం ను నిలదీయడంతోనే నిధులు మంజూరు అయ్యాయని, లేనిచో రైతులు ఇబ్బంది పడేదని గులాబీ నేతలు చెప్పుకుంటున్నారు.
గులాబీ పార్టీ రెండు సార్లు అధికారంలోకి రావడానికి ముఖ్య కారకులు రైతులే కావడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో వారిపైననే భారీగా ఆశలు పెట్టుకొంది. ఆ ఆశలు అడియాశలు అయ్యాయి. మూడోసారి అధికారం కోల్పోయింది. పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని బతికించుకోవాలంటే రైతు బందు ఒకటే కళ్లెదుట కనబడుతోంది. దాన్నే అస్త్రంగా గులాబీ అధినేత కేసీఆర్ ఎంచుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేపట్టిన కేసీఆర్ రైతు బందు నే ఆయుధంగా ఎంచుకున్నారు. రైతు బందు ఎందుకివ్వరో మీరు సీఎం రేవంత్ రెడ్దని నిలదీయాలి. మీ కోసం నేను తీసుకు వచ్చిన అద్భుతమైన పథకం. అటువంటి పథకాన్ని నీరుగార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపిస్తూ రైతులను ఆకట్టుకోడానికి ప్రయత్నాలు చేశారు.
కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రలో పదే పదే రైతు బందు గురించే మాట్లాడారు. తాను నిలదీయడంతోనే ప్రభుత్వం దిగివచ్చి నిధులు విడుదల చేసిందని కేసీఆర్ చెప్పుకొస్తున్నారు. ఎన్నిలకు సమయం దగ్గర పడింది. ఈ ఎన్నికల్లో ఎలాగయిన లబ్ది పొందాలనేది కేసీఆర్ ఆలోచన. మెజార్టీ సభ్యులు గెలువని నేపథ్యంలో పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారవుతుంది. అందుకనే కేసీఆర్ రైతు బందు పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకి చిక్కకుండ ఎన్నికలకు వరం ముందే నిధులు మంజూరు చేసింది. దింతో ప్రధాన పార్టీల నోటికి తాళం పడిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ మాటలను ఓటర్లు ఏ మేరకు నమ్ముతున్నారో , లేదో తెలియాలంటే జూన్ నాలుగో తేదీ వరకు వేచి చూడాల్సిందే.