YCP Pedana Ticket : వైసీపీలో టికెట్ల గోల పెరుగుతోంది. సీట్ల సర్దుబాటు జగన్ కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు పలువురు పార్టీ వీడేందుకు సిద్ధమైన నేపథ్యంలో పార్టీని ఎలా గాడిలో పెడతారనే వాదన వస్తోంది. ఇప్పటికే వైసీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు జగన్ లో వణుకు పుట్టిస్తున్నాయి. తమకు టికెట్ దక్కకపోతే టీడీపీలో చేరేందుకు కూడా వెనకాడటం లేదు.
క్రిష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ప్రస్తుతం అందరి ఫోకస్ లో పడుతోంది. ఇక్కడ పోటీ తీవ్రమైంది. ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. టికెట్ తమదంటే తమదే అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ తో పాటు దివంగత సీనియర్ నేత ఉప్పాల రాంప్రసాద్ కొడుకు రాము ఈ టికెట్ ను ఆశిస్తున్నాడు. ఇరువురిలో ఎవరికి టికెట్ వస్తుందో తెలియడం లేదు.
జోగి రమేష్ సొంత నియోజకవర్గమైన మైలవరం టికెట్ ఇస్తే అక్కడ కూడా పోటీకి సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ ఊరుకోడనే ఉద్దేశంతో ఇక్కడే టికెట్ కావాలని చూస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది పరిస్థితి. ఈ క్రమంలో పెడన టికెట్ పంచాయతీ ఇప్పుడు తేలేలా కనిపించడం లేదు.
ఉప్పాల రాము కుటుంబానికి టికెట్ దక్కుతుందా? లేక జోగి రమేష్ కు ఇస్తారా? అనేది తేలడం లేదు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన రాముకు తన భార్య హారికను జెడ్పీ చైర్ పర్సన్ చేశారు. ఇప్పుడు భార్య చైర్ పర్సన్ ఉండగా మళ్లీ అతడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రమేష్, రాము మధ్య టికెట్ పంచాయతీ కొనసాగుతోంది.