BJP ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కూటమి సమావేశం మంగళవారం సాయంత్రం జరగబోతున్నది. ఈ సమావేశానికి చిన్న చిన్న పార్టీలకు కూడా బీజేపీ ఆహ్వానం పంపింది. అందులో ఏపీ నుంచి జనసేన కూడా ఉంది. తొలిసారిగా ఇది తమ భాగస్వామి పార్టీ అని బీజేపీ గుర్తించిందనే చర్చ తెలుగు సర్కిళ్లలో నడుస్తున్నది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన ను బీజేపీ కూటమి సమావేశానికి పిలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అయితే జనసేనను బీజేపీ కలుపుకొని వెళ్లడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. గత ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీని కలవలేదు. ఏపీలో జనసేన ప్రత్యర్థి వైసీపీ అధినేత జగన్ కలిసేందుకు మాత్రం ప్రధాని మోడీ పలమార్లు అపాయింట్ మెంట్ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తో కూడా పవన్ అంతగా టచ్ లో లేరు. టీడీపీ అధినేత చంద్రబాబును మాత్రం ఆయన రెండుసార్లు కలిశారు. అయితే ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రత్యేకంగా కలిశారు.
అయితే ఇటీవల సమావేశంలో బీజేపీ సీరియస్ గా ఉంటే ఇతర పార్టీలతో పొత్తు ఆలోచన గురించి తమకు అవసరం ఉండేది కాదని పవన్ వ్యాఖ్యానించారు. ఇందులో కూడా కొంత నిజం ఉన్నట్లు జనసేన శ్రేణులు చెప్పుకొచ్చాయి. గతంలో ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ ప్రభుత్వం పై తనదైన స్థాయిలో పోరాడారు. అయితే ఆయనను తొలగించి సోము వీర్రాజును అధిష్టానం నియమించింది. ఆయన అటు వైసీపీపై పోరాటాన్ని పక్కన పెట్టారు. ఇప్పటివరకు కూడా జనసేన పార్టీతో కలిసి పని చేయలేదు.
అయితే ఇటీవలే బీజేపీ అధినాయకత్వం సోము వీర్రాజును కూడా మార్చి, పురందేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించింది. అయితే పవన్ ను కేవలం అవసరానికి మాత్రమే బీజేపీ ఉపయోగించుకుంటుందా.. ఈసారి పొత్తుల అంశంపై పవన్ ప్రతిపాదనలపై ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ఏపీలో పరిస్థితులపై కూడా పవన్ ఈసారి సీరియస్ గా బీజేపీ దృష్టికి తీసుకెళ్లాలనుకున్నట్లు సమాచారం.
వైసీపీ పై పోరాటం విషయంలో రాజీ పడకూడదని, అలా చేస్తే పొత్తు ధర్మాన్ని అతిక్రమించినట్లే అవుతుందని బీజేపీకి గట్టిగా చెప్పాలని పవన్ భావిస్తున్నారు. మరోవైపు టీడీపీతో కలిసి వెళ్లి జగన్ ను ఢీ కొట్టాలని పవన్ భావిస్తున్న సమయంలో, బీజేపీని కూడా ఇందులో భాగస్వామిని చేయాలని ఆయన కోరనున్నట్లు సమాచారం. ఏదేమైనా పవన్ ను ఈ భేటీ కి పిలవడం ద్వారా బీజేపీ కొత్త ఎత్తుగడకు ప్లాన్ వేసిందనే టాక్ అయితే మొదలైంది.