దక్షిణాదిలో కర్నాటక తర్వాత బీజేపీకి కొద్దొ గొప్పో ఆశలున్నవి తెలంగాణపైనే. ఇక్కడ పాగా వేయడం ద్వారా మున్ముందు సౌత్లోని మిగతా రాష్ట్రాలైన ఏపీ,తమిళనాడు,కేరళలలో విస్తరించేందుకు మార్గం సుగమం అవుతుందని ఆపార్టీ అంచనా వేస్తోంది. అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి విధానాలతో ముందుకెళ్లాలనే విషయంపై ఢిల్లీ బీజేపీ పెద్దలు చాలా సీరియస్ డిస్కషన్స్ జరిపినట్లు సమాచారం. రాష్ట్ర నేతలతో ఈ అంశంపై సుదీర్ఘంగా మంతనాలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.
అయితే రాష్ట్రంలో రాబోయే ఎన్నికలను ఎదుర్కోనేందుకు హిందు ఎజెండాను సీరియస్గా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు అనిపిస్తోంది. ఇందుకోసం కర్నాటక మోడల్ను తెలంగాణలోనూ అమలు చేయాలనే కాషాయ నేతలు భావిస్తున్నారు. కర్నాటకలో ఈసారి ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా బీ-ఫాం ఇవ్వలేదు. ఆ పార్టీలో చాలా మంది ముస్లిం సీనియర్ నేతలున్నారు. అయినప్పటికి వారికి భాజపా టికెట్లు దక్కలేదు.
ఇక ప్రస్తుతం తెలంగాణలోనూ ఇదే విధానాలను అవలంభించాలని నిర్ణయించినట్లు అర్థమవుతోంది. ఇక్కడ మొన్న చేవెళ్లలో జరిగిన సభలో అమిత్ షా తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. వాటిని బీసీ,ఎస్సీ,ఎస్టీలకు సర్దుబాటు చేస్తామన్నారు. దీంతో ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో కర్నాటక మోడల్నే బీజేపీ అనుసరించబోతుందని స్పష్టమవుతోంది.