తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 20 , లేదంటే 30 సీట్లు వస్తే వాళ్లంతా కేసీఆర్ తో కలుస్తారని సంచలన వ్యాఖ్యలు చేసాడు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు వచ్చినా 30 సీట్లు వచ్చినా మళ్ళీ కేసీఆర్ పార్టీలోకే పోతారు అనే ముద్ర ప్రజల్లో కూడా ఉందని , అందుకే వాళ్ళు 60 స్థానాలకు గాను 80 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని భావిస్తున్నారని తెలిపాడు.
నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ భారత్ రాష్ట్ర సమితి తో పొత్తు పెట్టుకోదు. రాహుల్ గాంధీ కూడా ఇదే విషయాన్ని పలుమార్లు వెల్లడించాడని గుర్తు చేసాడు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితం అవుతుందని , ఇక కేసీఆర్ పార్టీకి 25 స్థానాలు కూడా రావని ,కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందన్నాడు.
తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోరుకున్నారు. నైజాం నవాబు కూడా అభివృద్ధి చేసాడని , అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అయితే ఆత్మగౌరవమే పోరాటానికి సంసిద్దులను చేసిందన్నాడు రేవంత్ రెడ్డి. ఇటీవల సీనియర్ నేత జానారెడ్డి కాంగ్రెస్ – బీఆర్ఎస్ పొత్తుల గురించి వ్యాఖ్యానించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.