KCR : కేసీఆర్.. మొన్నటి వరకు రాజకీయ చతురతకు మారు పేరు. ప్రత్యర్థులను తన మాటలతోనే కట్టడి చేసే వాగ్ధాటి. ఉద్యమకారుడిగా దాదాపు 14 ఏళ్లు పోరాడి రాష్ర్ట సాధనలో కీలకంగా వ్యవహరించారు. ఒక దశలో కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఏర్పాటయ్యేదే కాదు అని జనాలు భావించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా దాదాపు పదేళ్ల పాటు పనిచేశారు. కొత్త కొత్త పథకాలతో ప్రజలను ఆకట్టుకున్నారు.
ఉద్యమ సారథిగా.. జనంలోకి..
కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించి ప్రత్యేక రాష్ర్ట సాధన కోసం పోరాడారు. ఈ క్రమంలో రెండు పార్టీలను తన పార్టీలో విలీనం చేసుకున్నాడు. కొంతకాలం పాటు అందరినీ కలుపుకుపోయి ఉద్యమాన్ని ఉరకలెత్తించాడు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ చెప్పడంతో 2004 లో ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాడు. కరీంనగర్ నుంచి ఎంపీగా బంపర్ మెజార్టీతో గెలిచాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాజీనామాలతో ఉద్యమాన్ని పూర్తిగా తన భుజాన ఎత్తుకున్నాడు.
ఈ క్రమంలో పార్టీ పరంగా బలహీన పడినా ప్రజల్లో మాత్రం ఉద్యమ సారథిగా మెదులుతూనే ఉన్నాడు. కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం శాసించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి బలమైన వ్యక్తితో పోరాడారు కేసీఆర్. ఆ తర్వాత వైఎస్సార్ చనిపోవడం, ఉమ్మడి రాష్ర్టంలో సీఎంల మార్పుతో ఉద్యమం మరింత బలపడింది. ఆ సమయంలో ఉద్యమానికి సారథిలా కేసీఆర్ మాత్రమే కనిపించాడు. కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా ప్రజలు స్వీకరించారు స్వచ్చందంగా మద్దతు తెలిపారు. దీంతో ఉద్యమం కేసీఆర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అనే పరిస్థితికి వచ్చింది. ఉద్యమంలో కేసీఆర్ ఏం చెప్పినా జనం నమ్మారు. ఆంధ్రా నాయకులను దుర్భాషలాడినా సమర్థించారు. జనాన్ని అలా ప్రభావిత చేయగలిగారు..
అధికారంలోకి వచ్చాక..
2014లో రాష్ర్ట ఏర్పాటు అనంతరం తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టినప్పుడు ఎన్నో సవాళ్లు.., ఎన్నో సమస్యలు. అన్నింటినీ ఒక్కొక్కటిగా అధిగమించాడు. ప్రధానంగా కరెంటు కోతలు తీర్చాడు. రైతాంగానికి ఉపయోగపడే పథకాలు రూపొందించడంతో కేసీఆర్ కు ఎదురులేకుండా పోయింది. ఇక ఇదే ఊపుతో రెండోసారి అధికారంలోకి వచ్చాడు. ఇక ఇక్కడి నుంచి ప్రజల నుంచి తాను పట్టుకోల్పోతున్నాననే విషయాన్ని కేసీఆర్ గ్రహించలేకపోయాడు.
తన పార్టీ నేతల అక్రమాలు తెలిసినా కేసీఆర్ వారించలేపోయాడు. నష్ట నివారణ చర్యలు చేపట్టలేదు. జనాల నుంచి వ్యతిరేకత కూడా బయటకు కనిపించలేదు. 2023 ఎన్నికల్లో ఓటమితో అన్నీ తెలిసి వచ్చాయి కేసీఆర్ కు. కానీ తన తప్పులను అంగీకరించడు కేసీఆర్. తాను నమ్మిందే కరెక్టు అనుకుంటాడు. ఇప్పటికీ అదే బాటలో పయనిస్తున్నాడు అప్పటి ఊక దంపుడు ఉపన్యాసాలు ఇప్పుడు కొనసాగిస్తుంటే జనాలు మాత్రం ఇప్పుడు అంగీకరించడం లేదు. ఒకప్పటిలా మద్దతు ఇవ్వడం లేదు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు కోల్పోతే బీఆర్ఎస్ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉన్నది. పరిస్థితులను చూస్తుంటే అలాగే కనిపిస్తున్నది.