JEE Mains : జేఈఈ మెయిన్స్ లో ఓ రైతు కుమారుడు ఆల్ ఇండియా నెం.1 ర్యాంకు సాధించాడు. మహారాష్ట్రకు చెందిన నీల్ కృష్ణ గజారే జేఈఈ మెయిన్ ఫలితాల్లో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించాడు. ఆయన తండ్రి నిర్మల్ వ్యవసాయం చేస్తున్నారు. వారి స్వస్థలం వాషిమ్ జిల్లాలోని బెల్ఖేడ్ అనే మారుమూల గ్రామం. జేఈఈ పరీక్షలకు సిద్ధం కావడానికి నీల్ రెండేళ్లుగా ప్రతిరోజూ 10 గంటల సమయం కేటాయించాడని అతని తండ్రి తెలిపారు. తన కొడుకు ఫస్ట్ ర్యాంక్ సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలను ఎన్ టీఏ బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా, అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 22 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్ డ్ కు ఎంపిక చేసింది.