2023 Roundup : ‘‘మూడోసారి పక్కా’’ అని బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, నేతలు ప్రగాఢంగా నమ్మారు. ఏదో ఒకటి చేసి కేసీఆరే సీఎం అవుతారని భావించారు. కొన్ని సీట్లు తక్కువొచ్చినా ఎంఐఎం, అవసరమైతే బీజేపీ సపోర్ట్ తీసుకుని అయినా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 3న ఫలితాలు వచ్చాయి. అనూహ్యంగా కాంగ్రెస్ గాలి వీచింది. పోస్టల్ బ్యాలెట్ తో మొదలు పెట్టి మారుమూల నియోజకవర్గాల్లో సైతం కాంగ్రెస్ జెండా రెపరెపలే కనిపించాయి. బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో ప్రభావం చూపింది ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే. అదే ఆ పార్టీకి ఒకింత ఉపశమనం. 2 శాతం సీట్లతోనే ఓడిపోయినా.. ఆ ఓట్లు సీట్లుగా మారకపోవడంతో హ్యాట్రిక్ పక్కా అనుకున్న పార్టీ అపొజిషన్ లో సెటిల్ కావాల్సి వచ్చింది.
బీఆర్ఎస్ ఇలా ఓడుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. అసలు ప్రజలు కాంగ్రెస్ పై ప్రేమతో గెలిపించారా? బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో గెలిపించారా?.. అంటే రెండో దానికే మొగ్గుచూపాల్సి వస్తుంది. మొదటి టర్మ్ లో బాగానే చేసినా బీఆర్ఎస్ కు రెండో టర్మ్ లో చేసినా పనులు పెద్దగా ఏమీ లేవనే చెప్పాలి. వీటన్నంటి కన్నా బీఆర్ఎస్ పెద్దల అహంకారమే ఆ పార్టీ కొంపముంచిందని విశ్లేషకులు చెపుతున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మొదటి టర్మ్ లో ప్రజలకు కాస్త అందుబాటులోనే ఉండేవారు. కానీ సెకండ్ టర్మ్ కు వచ్చే సరికి నెలకు 25 రోజులే ఫామ్ హౌస్ లోనే ఉండడం సాధారణంగా జనాలకు తీవ్ర ఆగ్రహం కల్పించిందనే చెప్పాలి. ఏదో కార్యక్రమం ఉంటే తప్పా జనాల్లోకి రాకపోవడంతో.. ఆయనకు, ప్రజలకు మధ్య ఏదో గ్యాప్ వచ్చిందనే ఫీలింగ్ కలిగింది.
తనతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రజా సంఘాలకు, నేతలు, కవులు, గాయకులు..ఇలా ఎంతో మందిని ఆయన పక్కన పెట్టారు. తనను ప్రశ్నించిన వారిని కనీసం తన దగ్గరికి రానివ్వలేదు. గద్దర్ లాంటి వారిని ప్రగతిభవన్ గేట్ల వద్ద ఆపడం అందరినీ కలిచివేసింది. అందెశ్రీకి ఇదే పరాభవం ఎదురైంది. అయితే కొందరికీ మాత్రం పదవులు ఇచ్చారు. అయినా మెజార్టీవారు తెలంగాణలో తమ ఆకాంక్షలు నెరవేరలేదని భావించారు.
2018ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇచ్చిన కేసీఆర్ అప్పటి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కానీ అదే అభ్యర్థులతో 2023 ఎన్నికలకు పోవాలని భావించడం.. నిజంగా ప్రజలను తక్కువగా అంచనా వేయడమే. ఎందుకంటే సగం మందికి పైగా ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అవినీతి ఆరోపణలు, ఇసుక దందాలు, రియల్ ఎస్టేట్ బాగోతాలు, భూకబ్జాలు, ప్రభుత్వ పథకాల అమలుకు డబ్బుల వసూళ్లు, కొందరిపై లైంగిక ఆరోపణలు.. ఇలా ఎన్నెన్నో ఆరోపణ బీఆర్ఎస్ అభ్యర్థులపై ఉన్నాయి. వాటిని కేసీఆర్ పట్టించుకోకుండా .. పదేళ్లు వారిని జనాలపై రుద్ది.. మరోసారి రుద్దుదామనుకుంటే జనాలు ఊరుకుంటారా? తాను ఏది చెప్పినా జనాలు వింటారు అనుకోవడం..ప్రజలను చిన్న చూపు చూసినట్టే కదా. తన అభ్యర్థుల్లో ఆరోపణలు ఉన్నవారిని మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తే మరిన్ని సీట్లు వచ్చేవి. కొంతమందిని మారిస్తే అక్కడ మంచి ఫలితాలే వచ్చాయి కదా.
ఇక బీఆర్ఎస్ రాత మార్చిన వాటిలో ప్రధానమైంది నిరుద్యోగుల అంశం. తెలంగాణ ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. వాటిలో అత్యంత కీలకమైంది.. తెలంగాణ ఏర్పాటుకు మూలమైంది.. ఉద్యోగాల అంశం. కానీ దాన్నే కేసీఆర్ మరిచిపోయారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క గ్రూప్ -1 వేయలేదంటేనే తెలుస్తుంది..ఆ పార్టీ నిర్లక్ష్యమెంటో. ఇక ఎన్నికల వేళ ఒకేసారి 80వేల పోస్టులు కుమ్మరించారు. వేశారు ఓకే కానీ వాటిని పారదర్శకంగా నిర్వహించాలన్న విషయాన్ని మరిచారు. ఇష్టారీతిన వ్యవహరించారు.
గ్రూప్-1 సహ పరీక్ష పేపర్లు లీక్ కావడం, ఆ తర్వాత ప్రిలిమ్స్ రెండు సార్లు రద్దు, గ్రూప్ 2 వాయిదాలు.. ఇలా అంతా గందరగోళం. నిరుద్యోగులు నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఒక్కసారైనా కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ వారికి భరోసా కల్పించలేకపోయారు. మీకు మేం అండగా ఉంటామని ఏనాడూ చెప్పలేకపోయారు.. ఇవన్నీ నిరుద్యోగులకు కోపం తెప్పించాయి. కనీసం ఎన్నికల మ్యానిఫెస్టోలో నిరుద్యోగుల గురించి ఒక్క అంశం చేర్చలేదు. ఎన్నికల ప్రచార సభల్లో ఒక్కసారి నిరుద్యోగులు అనే మాట ఉచ్చరించలేదు. నిరుద్యోగుల విషయంలో అహంకారపూరితంగా వ్యవహరించి, వారి కోపాగ్ని జ్వాలకు ఆ పార్టీ అహూతైపోయింది.
వాస్తవానికి ప్రస్తుతం జనాల్లో ఉన్న టాక్ ఏంటంటే.. ‘‘కేసీఆర్ ను ఎవరూ ఓడించలేదు.. తనకు తానే ఓడించుకున్నాడు’’ అని. వారి అహంకారమే వారి పతనానికి దారితీసిందని అంతా భావిస్తున్నారు. ఆ అహంకారమే లేకుంటే ఇవాళ మూడోసారి బీఆర్ఎస్ కచ్చితంగా అధికారంలోకి వచ్చేదే కదా అని అనుకుంటున్నారు.