ANR Centenary Celebrations : నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర్ రావు గురించి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశానికి కూడా పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఏలిన వారిలో అగ్రగణ్యుడిగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి. వందలాది సినిమాలు చేసిన ఆయనను భారత ప్రభుత్వం అనేక బిరుదులు ఇచ్చి తనను తాను సత్కరించుకుంది. ఆధ్యాత్మిక, సామాజిక, సంస్కృతిక ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో విభిన్నమైన గొప్ప చిత్రాలను తీశారు ఆయన.
ఆయన చేసిన ప్రతీ సినిమా ఒక కళాఖండమనే చెప్పాలి. తనకు క్యాన్సర్ ఉందని తెలిసినా కూడా ఆ తెలుగు కళామతల్లిని చివరి సారిగా ముద్దాడాలని ‘మనం’లో నటించి కన్ను మూశారు. సినిమాలు అన్నా.. కళ అన్నా.. కళాకారులు అన్నా ఆయనకు ఎనలేని గౌరవం. దగ్గుబాటి కుటుంబంతో వియ్యం అందుకున్న ఆయన ఆ కుటుంబం బ్యానర్ పై కూడా అనేక చిత్రాలు తీశారు. ఆయనకు జానర్ తో పట్టింపు లేదు. ఎందులో నైనా ఒదిగిపోయేవారు.
అలాంటి మహానుభావుడి శత జయంతి (100 బర్త్ డే ఆనివర్సరీ) వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ‘కళాదర్బార్-ఆంధ్రప్రదేశ్’ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు కళా సామ్రాట్ పొత్తూరి రంగారావు ఆధ్వర్యంలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 24 సెప్టెంబర్, 2023న శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం, గుంటూరు వేదికపై సాయంత్రం 5 గంటలకు జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కళారంగానికి సేవలు చేసిన ప్రముఖులకు అక్కినేని అవార్డులను అందజేయనున్నారు.
ఈ వేడుకలకు ఆత్మీయ అతిథులుగా అయోధ్య రామిరెడ్డి, అప్పిరెడ్డి, మనోహర్ నాయుడు, శ్రీధర్, ఆంజనేయులు, రాజేంద్రప్రసాద్, నాగభూషణంతో పాటు యూ బ్లడ్ ఫౌండర్ డా. యలమంచలి జగదీష్ బాబు హాజరవనున్నారు. వీరితో పాటు అతిథులుగా జగపతి బాబు, గౌతమి, గోపాల్, కాట్రగడ్డ ప్రసాద్, ఆకునూరి శారద, మిట్టపల్లి మోహన్ శేషయ్య, సుశీల్ కుమార్, విజయలక్ష్మి, రాము తదితరులు పాల్గొననున్నారు.