America approved Vaccine : వ్యాధులపై మనిషి నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. ఒక్కో సారి సక్సెస్.. మరో సారి ఫెయిల్యూర్ ఎదుర్కొంటున్నాడు. మనిషిని ఇబ్బంది పెట్టే ఎన్నో వ్యాధులకు సంబంధించి నివారణ ఉపాయాలు (వ్యాక్సిన్స్) కనుక్కొన్నా.. మరో వ్యాధి పుట్టుకస్తూనే ఉంది. మొన్న కొవిడ్ చేసిన విలయ తాండవం బహుషా ప్రపంచం మరిచిపోయేందుకు చాలా సంవత్సరాలు పడుతుందేమో. ఇంత పెద్ద వ్యాధులు కాకపోయినా కొన్ని రకాల వ్యాధుల చికాకు ఇబ్బంది కలిగించి చివరికి మరణం వరకు తీసుకెళ్తాయి. అందులో కొన్ని మందులకు లొంగితే మరికొన్నింటిని ఇమ్యునిటీ పవర్ ఎదిరిస్తుంది.
చికున్ గున్యా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కీళ్లనొప్పులు, జ్వారం కలిగించి మనిషిని మరింత కుంగదీస్తుంది. ఇది శరీరానికి కలిగించే బాధ వ్యాధి నుంచి ఉపశమనం పొందినా చాలా రోజుల వరకు దాని తీవ్రత ఉంటుంది. ఈ వ్యాధికి కారణమైన వైరస్ దోమల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి మందులకు లొంగినా.. చికున్ గున్యా రాకుండా అడ్డుకునేందుకు జరిపిన ప్రయోగాలు సఫలీకృతం అయ్యాయి. దీనికి వ్యాక్సిన్ కూడా ఇప్పుడు అందు బాటులోకి రానుంది.
ప్రపంచంలోనే మొదటి సారి యూరప్ కు చెందిన వల్నేవా అనే ఫార్మా కంపెనీ చికున్ గున్యాను అడ్డుకునేందుకు వ్యాక్సిన్ రూపొందించింది. ఈ వ్యాక్సిన్ ద్వారా ఈ వ్యాధిని అడ్డుకోవచ్చని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ తెలిపింది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు దీన్ని ఉపయోగించవచ్చని వెల్లడించారు. లిక్స్చిక్ (Ixchiq) పేరుతో ఈ వ్యాక్సిన్ను విక్రయించనున్నారు. వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్న దేశాలకు ఈ వ్యాక్సిన్ ను అత్యంత వేగంగా అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.
ఈ వ్యాధి (చికున్ గున్యా) తీవ్రత ఎక్కువగా ఆఫ్రికా, ఆగ్నేయాసియా, అమెరికాలోని ఊష్ణ మండల ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. 15 ఏండ్లలో దాదాపు 5 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వ్యాధి భారిన పడ్డారు. దీంతో పాటు కొత్త భౌగోళిక ప్రాంతాలకు వ్యాపించి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిసీజ్ లలో గుర్తింపు పొందిందని ఎఫ్డీఏ తెలిపింది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలను కలిగించే ఈ వైరస్ వృద్ధుల్లో ఎక్కువ సమస్యలు తీసుకస్తుందని ఎఫ్ డీఏ అధికారి పీటర్ మార్క్స్ వెల్లడించారు.
‘లిక్స్చిక్’ వ్యాక్సిన్ ను ఉత్తర అమెరికాలో 3500 మందిపై పరీక్షించామని వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అలసట, తలనొప్పి, జ్వరం, కీళ్ల నొప్పులు, వికారం లాంటి సాధారణ దుష్ర్పభావాలు కలిగాయని అధికారులు చెప్పారు. 1.6 శాతం మందిలో మాత్రమే తీవ్రమైన దుష్ర్పభావాలు కనిపించగా.. ఇద్దరు మాత్రం దవాఖానలో చేరాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు.