Bandi Sanjay : ఢిల్లీలో బండి సంజయ్ పార్టీ అగ్రనేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇటీవల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై ప్రచారం జోరుగా జరుగుతున్నది. ఈ సమయంలో పార్టీ పెద్దలు బండి సంజయ్ని తొలగించి, మరొకరికి అవకాశం ఇస్తారని అంతా అనుకుంటున్నారు. ఇప్పటివరకు ఈటల రాజేందర్, డీకే అరుణ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు బండి సంజయ్ ఢిల్లీలో వరుస భేటీల వెనుక కారణం ఏంటనేది మాత్రం తెలియడం లేదు. ఎన్నికలు సమీపిస్తుండడంతో, ఈ నెలలో తెలంగాణలో పార్టీ అగ్రనేతల బహిరంగ సభలకు బీజేపీ తెలంగాణ శాఖ ప్లాన్ చేస్తున్నది.
అయితే ఈనెల 25న జేపీ నడ్డా ఖమ్మంలో పర్యటించనున్నారు. ఆ తర్వాత నెలాఖరులో అమిత్ షా సభ ఉండనుంది. వీరి తర్వాత రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన కూడా ఉండనుంది. అయితే అగ్రనేతల పర్యటనను ఖరారు చేసేందుకే బండి సంజయ్ ఢిల్లీలో ఉన్నట్లు స్థానిక పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఓ వైపు తెలంగాణలో ఎన్నికలు దూసుకొస్తుంటే ఇప్పుడు అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చని శ్రేణులు చెబుతున్నాయి. బండితో విభేదిస్తున్న పలువురు నేతలతో అగ్రనేతలు మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే బండి. సంజయ్కి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే టాక్ కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ అవకాశమే లేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి,
ఏదేమైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఎన్నికల దూకుడు కనిపిస్తుంటే, బేజేపీలో మాత్రం అధ్యక్షుడి మార్పు అంశమే ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది. బండి సంజయ్ని వ్యతిరేకిస్తున్న పలువురు నేతలు విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్ ఢిల్లీలో ఉండడంతో, పార్టీ పెద్దలతో మార్పుపైనే చర్చలు జరుపుతున్నట్లుగా అంతా భావిస్తున్నారు. అగ్రనేతల పర్యటనను ఖరారు చేసేందుకే అక్కడ ఉన్నారని బండి సంజయ్ అనుచరులు చెబుతున్నారు.