Jeevan Reddy : తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎంపీ అభ్యర్థులు ఊరూ,వాడ తిరుగుతూ ఓటర్లను తమకే ఓటు వేయాలని ప్రాథేయపడుతున్నారు. అయితే వీరికి ఒక్కోసారి జనాల నుంచి వ్యతిరేకత కూడా ఎదురవుతుంటుంది. ఇంతకుముందు గెలిపిస్తే ఏం చేశారని… గెలిపించిన తర్వాత తమను పట్టించుకోరని..ఇలా రకరకాలుగా ఓటర్ల నుంచి స్పందన వస్తుంటుంది. వీటిని కొందరు అభ్యర్థులు పెద్దగా పట్టించుకోరు..కానీ కొందరు ఓటర్లపైనే సీరియస్ అవుతుంటారు. ఇలాంటి నేపథ్యంలో నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి ఓ మహిళ చెంపచెల్లుమనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ వైరల్ చేస్తున్నాయి.
శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవిందపేట్, చేపూర్, పిప్రీ గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న చోట కూడా ప్రచారం చేశారు. అక్కడ ఉపాధి హామీ పనులకు వచ్చిన ఓ మహిళ గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓటు వేశానని, కానీ తనకు పింఛన్ రావడం లేదని వాపోయింది. ఎవరికీ ఓటు వేశావని సదరు మహిళను జీవన్ రెడ్డి ప్రశ్నించారు. మీకే వేశాను అనగానే వినయ్ రెడ్డి గెలువలేదని, అన్యాయం జరిగిందన్నారు. అయినప్పటికీ తనకు పింఛన్ రావడం లేదనగానే ఆమె చెంపపై జీవన్ రెడ్డి చేయిచేసుకున్నారు.
అక్కడే ఉన్న కొందరు ఈ సంఘటనను సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇప్పుడు జీవన్ రెడ్డి వ్యవహార శైలిపై వివాదం నెలకొంది. మహిళ అని చూడకుండా జీవన్ రెడ్డి అహంకారపూరితంగా ప్రవర్తించారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
View this post on Instagram