YCP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. జూన్ నాలుగున ఫలితాలు వెల్లడించడానికి ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. రాబోయే ఫలితాలు ఎవరికి అనుకూలమనే విషయాన్ని ప్రజలు తేల్చేసారు. కానీ వైసీపీ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆ గంభీర్యంలో అపజయం, పరాజయం కలిపి వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే ఓట్లు వేసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఓడిపోతామనే పుట్టెడు భాదను కడుపులో దాచుకొని వైసీపీ శ్రేణులు చేజారిపోకుండా ఉండేందుకే ఇలా గంభీరంగా మాట్లాడుతున్నారా అనే అనుమానాలు కూడా ప్రజల్లో వ్యక్తం కావడం విశేషం.
ఇటీవల ఒక వైసీపీ నాయకుడు రెండు రకాల మాటలు మాట్లాడారు. తాజా ఎన్నికల్లో గెలువబోతున్నాం. 175 సీట్లకు 175 స్థానాల్లో మనమే గెలువబోతున్నాం. సంబరాలకు సిద్ధంగా ఉండండి అన్నారు. అన్ని స్థానాల్లో వైసీపీ గెలుస్తున్నదనే ధీమాను కూడా ప్రకటించారు. అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు స్థానమే లేదన్నట్టుగా మాట్లాడారు. అదేవిదంగా మరో మాట కూడా మాట్లాడారు ఆ నాయకుడు. చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లారు. వెళ్లడం వలన వైసీపీ నేతలకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కనీసం రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెప్పి పోవాలనే ఆలోచన కూడా లేదా అని సెలవిచ్చారు. అంటే వైసీపీ జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందడం ఖాయం, ప్రతిపక్ష పార్టీ గా అవతరించబోతోందని ఆయన చెప్పకనే చెప్పేశారు. ఐదేళ్ల పరిపాలన చూసిన ప్రజలు మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించారని ఒప్పేసుకున్నారు.
సర్వే మాంత్రికుడు కూడా వైసీపీ ఓటమి ఖాయమని తేల్చేసారు. ఆయన మాటలను కూడా వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారు. ఎన్నికల ఫలితాలను సమర్ధించుకునే రీతిలో వైసీపీ నేతలు మాట్లాడం చూస్తే విడ్డూరంగా ఉంది. ఓటమిని ఒప్పుకున్నట్టే ఒప్పుకొని, విజయం మాదే అని గర్వంతో చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా మేకపోతు గాంభీర్యాన్ని
ఒక ఇంటర్వ్యూలో ప్రదర్శించారు. రెండోసారి కూడా అధికారంలోకి రాబోతున్నామని ఆ మీడియా వేదికగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా విశాఖ పట్టణంలో ప్రమాణ స్వీకారం కూడా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రకటించడం జగన్ విజయానికి కొసమెరుపు.