Pennelli Ramakrishna : ఏపీలో మే13న పోలింగ్ ముగిసింది. ఎన్నికల సందర్భంలో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. దాడులతో కొన్ని ప్రాంతాల్లో రక్తపాతం జరిగింది. పోలింగ్ సమయంలో మాచర్లలో జరిగిన దాడులు, ఈవీఏం ధ్వంసం ఘటనలు అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయ్యాయి. మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటన దేశాన్నే నివ్వెరపోయే విధంగా చేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనాను దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సూచించింది. ఇప్పటివరకు ఆయనపై కేసు నమోదు చేసి ఎందుకు అరెస్ట్ చెయ్యలేదంటూ ప్రశ్నించింది. వెంటనే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
ఇప్పటికే ఆయన కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు ఈ రోజు ఆయనను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. పిన్నెల్లిని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలు హైదరాబాద్ కు చేరుకున్నాయి. ఎస్పీ మలికా గార్గ్ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులతో పాటు తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంగారెడ్డి వైపు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సంగారెడ్డి జిల్లా కంది వద్ద ఆయన కారును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ను పోలీసుల బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. పోలీసుల అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో కారు వదిలి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి పరారయ్యారు. పోలీసులు పిన్నెల్లి డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆయన అరెస్ట్ వ్యవహారంలో హై డ్రామా కొనసాగుతోంది.