కర్నాటక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఓటర్లను ప్రసన్నం చేసుకొని మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది. బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా సోమవారం ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఇక ఈసారి బీజేపీ మ్యానిఫెస్టోలో చాలా హామీలనే ఇచ్చింది.
ప్రజల్లో బీజేపీ విషయంలో ఏ అంశాలపై వ్యతిరేకత ఉందని గ్రహించి ఆమేరకు కర్నాటక ఎన్నికల మ్యానిఫోస్టోను ఆపార్టీ తయారు చేసింది. బీజేపీ రెండోసారి దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ల ధరలు బాగా పెరిగాయనే విమర్శ ఉంది. కర్నాటకలో నందిపాల వ్యవహారం కూడా ఆపార్టీని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ అంశం బీజేపీని చాలానే ఇబ్బంది పెట్టింది. అంతేకాదు రానున్న ఎన్నికల్లో పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కీలక అంశాలను ఎజెండాలో చేర్చింది.
కర్నాటకలో ఉమ్మడి పౌరస్కృతి రద్దు,బీపీఎల్ ఫ్యామిలీస్కు ఉచితంగా 10 లీటర్ల నంది పాలు,ఐదు కిలోల ఉచిత రేషన్ బియ్యం,ఐదు కిలోల తృణధాన్యాలు,కర్నాటక యాజమాన్య చట్ట సవరణ,ప్రతి వార్డులో అటల్ ఆహార కేంద్రాలు,ఎస్సీ,ఎస్టీ మహిళలకు ఫిక్స్డ్ డిపాజిట్ పథకం వర్తింపు వంటి స్కీంలను బీజేపీ ఈసారి తన ఎలక్షన్ ఎజెండాలో పొందుపరిచింది.
అంతేకాదు కర్నాటకలోని జిల్లాలు,ప్రాంతాలను బట్టి స్థానిక నేతలకు అధిష్టానం పూర్తి స్వేచ్చనిచ్చింది. ఆయా ప్రాంత ప్రజల అవసరాలకు తగ్గట్టు హామీలను ఇవ్వొచ్చని తెలిపింది. ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ నుంచి పూర్తి స్వేచ్చనిస్తున్నట్లు వెల్లడించింది. ఆయా జిల్లాల్లో బీజేపీ నేతలు ఇచ్చే హామీల తీవ్రతను బట్టి వాటిలో కొన్నింటిని మళ్లీ కర్నాటక ఎన్నికల ఎజెండాలో కూడా చేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆపార్టీ అధినాయకత్వం స్పష్టం చేసింది.