Crime News : తమ చెల్లెలు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని సోదరులు (పెదనాన్న కొడుకులు) బావను హత్య చేశారు. ఆపై ఆత్మహత్యగా చిత్రించేందుకు చేసిన యత్నాలు ఫలించక పోలీసులకు చిక్కారు. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగుచూసింది. రూరల్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన ప్రకారం..
చిరుతానుపాడు గ్రామానికి చెందిన పద్దం ఉంగయ్య (20) కొత్తూరు గొత్తికోయ గుంపునకు చెందిన మడావి ఉంగీని నెల రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అది ఇష్టం లేని యువతి కుటుంబ సభ్యులు చిరుతానుపాడులో పంచాయితీ పెట్టారు. పిన్న వరసయ్యే అమ్మాయిని పెళ్లి చేపుకున్నావని పెద్ద మనులు ఉంగయ్యకు రూ.1.50 లక్షల జరిమానా విధించారు. ఉంగయ్య అదే రోజు రూ.1.20 లక్షలు చెల్లించి భార్యను తీసుకెళ్లాడు. మిగతా డబ్బు ఇవ్వాలంటూ ఏప్రిల్ 26న యువతి పెదనాన్న కుమారులు ఇడమయ్య, అడమయ్య, ఒక బాలుడు (16) ఉంగయ్య ఇంటికి వచ్చారు.
తన వద్ద డబ్బుల్లేవని చెప్పడంతో చెల్లెలు ఉంగీని తమ ఊరికి తీసుకు వెళ్లారు. అయితే అదే రోజు రాత్రి ఉంగీ కనిపించకుండా పోయింది. దీంతో ఆమెను వెతుక్కుంటూ బయల్దేరిన సోదరులకు చిరుతానుపాడు సమీపంలో ఉంగయ్య కనిపించడంతో తమ చెల్లెలు ఎక్కడని ప్రశ్నించి గొడవపడ్డారు. ఆవేశంలో ఉన్నవారు కండువాను మెడకు బిగించి హత్య చేశారు.
మృతుడి కుటుంబ సభ్యలు ఉంగయ్య అదృశ్యంపై ఏప్రిల్ 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు చెట్టుకు ఉంగయ్య శవం వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు యువతి సోదరులను అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.