Chandrababu & KCR Same Requests : తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అధికార పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ జిల్లాలను చుట్టుముడుతున్నారు. రోజూ 3 బహిరంగ సభల్లో పాల్గొంటూ శ్రేణులను ఉత్సాహ పరుస్తున్నారు. అయితే ఆయన ప్రజలతో చెబుతున్న ఓ మాట ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేస్తున్నది.
ఏపీలో 2019లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను ఓడిపోతే, తనకేం కాదని కాని రాష్ర్టం చాలా కోల్పోతుందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తాను ఇంట్లో మనుమడితో ఆడుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే ఈ నాలుగేళ్లలో ఆయన మనుమడితో ఆడుకోవడం కంటే ప్రజల్లోనే ఎక్కువగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఏపీలోటీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలో గడిపారు. ఇదే కారణంతో 52 రోజుల క్రితం ఆయనపై వివిధ అవినీతి అభియోగాలు మోపింది ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం..
ఇక ఇప్పుడు తెలంగాణలో కూడా అదే రీతిలో ప్రచారం జరుగుతున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు. బీఆర్ఎస్ కు ఓటేయకపోతే ప్రజలే నష్టపోతారని చెబుతున్నారు. తమను దూరం చేసుకుంటే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటామని చెబుతారా.. అయితే నిజానికి అధికారానికి దూరమైనా వారు విశ్రాంతి తీసుకుంటారా అంటే అనుమానమే. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉండే అవకాశం అధికార పార్టీగా కంటే ప్రతిపక్ష పార్టీలకే ఎక్కువగా ఉంటుంది. మరోవైపు గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అవినీతిని వెలికితీసే పని ఎలాగూ కొత్త గా వచ్చిన ప్రభుత్వం వెలికితీయడం మొదలుపెడుతుంది. ఇలాంటి ప్రకటనలకు బదులు వారు నిజానికి ప్రజలకు చేసింది చాలా ఉంది. ఈ విషయాలు చెప్పుకొని ప్రచారంలోకి వెళ్తే బాగుంటుంది. ఎంతసేపూ అభద్రతాభావంతో కాంగ్రెస్, రేవంత్ రెడ్డి జపంతోనే నేతల ప్రసంగాలు ఉంటున్నాయి. లేని హైప్ ను వారు ఇచ్చేస్తున్నారు.