Chandrababu with TDP : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం దిశగా దూసుకెళ్తున్నదని అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్లో ఆయన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో మాట్లాడారు. జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైనందున టీటీడీపీ తరఫున చంద్రబాబును సన్మానించారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ అధికారంలో లేకున్నా కార్యకర్తలు అందరూ ఇంకా ఉత్సాహంగానే పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ హైదరాబాద్ ఇంతటి అభివృద్ధిలో, ఈరోజు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందంటే తెలుగుదేశం పార్టీ పునాది వేయడమే కారణమన్నారు.
తెలుగువారిని సంపన్నులను చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్నారు. నాడు ఐటి రంగాన్ని హైదరాబాద్కు తీసుకురావడం వల్లనే ఈరోజు ప్రపంచ సంస్థలన్నీ ఇక్కడికి క్యూ కడుతున్నాయని పేర్కొన్నారు. అన్ని రంగాలకు హైదరాబాద్ హబ్ లా మారిందని దీని వెనుక తెలుగుదేశం పార్టీ కృషి ఉందని చెప్పారు.
అయితే బిజెపితో పొత్తుల అంశంపై చంద్రబాబు మాట్లాడలేదు ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతలతో తెలంగాణలో పొత్తులపై చంద్రబాబు మాట్లాడాలని వార్త కథనాలు వెలువడ్డాయి. కానీ ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు పొత్తులపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
టీటీడీపీకి అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ అయిన తర్వాత కొంత బలోపేతం అయినట్లుగా అందరూ భావిస్తున్నారు. మహానాడు సందర్భంగా టిడిపి జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు ఎన్నిక లాంఛనంగా జరిగినందున తెలుగుదేశం పార్టీ తెలంగాణ శ్రేణులు ఈ కార్యక్రమం నిర్వహించాయి. అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమానికి శ్రేణుల సంబరాలు మిన్నంటాయి.