Congress vs TRS :
తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనంటూ చెప్పుకొచ్చిన బీజేపీలో ఇప్పుడు నిశ్శబ్ధం ఆవరించింది. పార్టీ అధ్యక్షుడి మార్పుతో బీజేపీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. ఎన్నికల వరకు కమలం పార్టీ ఇంకెలా ఉంటుందోననే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో అధికార బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ నే టార్గెట్ చేసుకుంటున్నది. తానా సభల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలపై గులాబీ పార్టీలో రాష్ర్టంలో ఆందోళనలు చేపట్టింది. అధికార పార్టీ ధర్నాలు చేయడం కొంత విస్మయానికి గురి చేసింది. దీంతో బీఆర్ఎస్ లో కూడా ఎక్కడో చిన్న అలజడి మొదలైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్ ను లెక్కలోకి తీసుకోని సీఎం కేసీఆర్ తమ పార్టీ శ్రేణులతో హస్తం పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేయించడం చూస్తుంటే రాష్ర్టంలో కారు వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ కనిపిస్తున్నది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా అధికార పార్టీపై వెనక్కి తగ్గడం లేదు. కరెంట్ సరఫరా విషయంలో అధికార పార్టీని ఇరుకున్న పెడుతున్నది. సబ్ స్టేషన్ల ముట్టడికి దిగింది. దీంతో ఇన్ని రోజులు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పుకొచ్చిన నేతల మాటలు అసత్యాలని కాంగ్రెస్ నేతలు నిరూపిస్తున్నారు. ఎక్కడా 24 గంటల నిరంతర కరెంట్ ఇవ్వడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ పరిధిలోని సబ్ స్టేషన్ల వద్ద రికార్డులు చూపిస్తున్నారు. ఇది బీఆర్ఎస్ కు మాత్రం ఇబ్బంది కరంగా మారింది.
దీంతో గులాబీ శ్రేణులు అంతా గత కాంగ్రెస్ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ర్టం చీకట్లో మగ్గుతుందనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ కూడా దీనిని ప్రతిఘటిస్తున్నది. 24 గంటల కరెంట్ ఇవ్వకుండానే ఇస్తున్నామంటూ ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేస్తున్నదంటూ హస్తం నేతలు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు పార్టీల పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో కమలం పార్టీ జాడే కనిపించడం లేదు. దీంతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రం కానున్నట్లు తెలుస్తున్నది.
ReplyForward
|