గ్రౌండ్ రిపోర్ట్: ఏకపక్షమే..
అసెంబ్లీ నియోజకవర్గం: హిందూపూర్
టీడీపీ: బాలకృష్ణ
వైసీపీ: దీపిక!, ఇక్బాల్!
జనసేన: ఆకుల ఉమేశ్!
Hindupur Constituency Review: అక్కడ ఉంది బాలయ్య. ఆయన పేరు చెబితేనే దబిడి.. దిబిడే.. ఈయనే కాకుండా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి హిందూపురం కంచుకోటే. 1983లో పామిశెట్టి రంగనాయకులు టీడీపీ గెలుపును ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ పార్టీకి ఓటమి అన్నది లేదు. తర్వాత 1985లో పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా రెండు సార్లు, బైపోల్ లో ఆయన కొడుకు హరికృష్ణ ఒక్కసారి. బాలకృష్ణ రెండు సార్లు విజయం సాధించాడు. హిందూపురం పూర్తిగా టీడీపీదే అని ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసింది. రాష్ట్రంలో ఏ పార్టీ పదవిలో ఉన్నా హిందూపురంలో మాత్రం టీడీపీనే ఉంటుంది.
1951 డీలిమిటేషన్ లో ఈ నియోజకర్గం ఏర్పడింది. ఇందులో మూడు మండలాలు ఉన్నాయి. 1. హిందూపూర్, 2. లేపాక్షి, 3. చిలమత్తూర్. ఇక ఓటర్ల సంఖ్య తీసుకుంటే (2019 నాటికి) 2,08,327 మంది ఉన్నారు. 1952 నుంచి ఉన్న ఈ నియోజకవర్గం నాలుగు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు స్వతంత్ర్య అభ్యర్థులు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీలో నిలిచిన షేక్ మహ్మద్ ఇక్బాల్ 17000 ఓట్ల పైచిలుకుతో ఓటమి పాలయ్యారు. ఈ సారి పోటీ రసవత్తరంగా ఉండబోతోందని తెలుస్తోంది.
గతంలో జనసేన పార్టీ నుంచి ఆకుల ఉమేష్ బరిలో నిలిచినా. కేవలం 4 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే సాధించారు. అయితే ఈ సారి పొత్తులు ఉంటాయన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలతో ఒక వేళ పొత్తు ఉంటే మాత్రం అక్కడ జనసేన నుంచి అభ్యర్థిని నిలబెట్టే సాహసం చేయరని రాష్ట్రం మొత్తం తెలుసు. పొత్తులో భాగంగానే నందమూరి బాలకృష్ణ మాత్రమే పోటీ చేస్తారు.
తెలుగుదేశం పార్టీ
హిందూపురం 1983 నుంచే టీడీపీకి కంచుకోట. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీలో నిలిచినా సరే టీడీపీ అభ్యర్థే విజయం సాధిస్తాడు. ఇది అక్కడ సంప్రదాయంగా వస్తుంది. ఈ సారి కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించడంతో పాటు హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్నాడు బాలయ్య. అందుకు అన్ని అంశాలు ఆయనకు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. సినిమాల్లో బిజీగా ఉన్నా సరే.. అప్పుడప్పుడు నియోజకవర్గానికి వెళ్లి వస్తుంటారు బాలయ్య బాబు. వీలు దొరికినప్పుడల్లా అక్కడి నాయకులతో టచ్ లో ఉంటారు. సమస్యలు తెలుసుకుంటూ వేగంగా స్పందిస్తారు.
దీంతో ఆయనకు అక్కడ ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు. ఈ సారి కూడా తప్పకుండా విజయం సాధిస్తారని టాక్ ఉంది. అయితే, కొన్ని రోజులుగా సొంత పార్టీలోని నేతలు కొంత నిరసన రాగం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ కోసం కాకుండా.. చిన్న చిన్న పదవుల కేటాయింపుపై కొంత అసంతృప్తిగా ఉన్నారని వినికిడి. ఎన్ని ఉన్నా చివరికి నందమూరి ఫ్యామిలీకే జై కొడతున్నారు. అయితే గతంలో కేవలం 17000 పై చిలుకు మెజారిటీ మాత్రమే సాధించిన బాలయ్య బాబు. ఈ సారి దీన్ని అధిగమిస్తాడా? అన్న సందేహం మాత్రం కలుగుతుంది.
వైఎస్సార్ పార్టీ
హిందూపురం నందమూరికి కంచుకోటగా ఉంది. దాదాపు 40 సంవత్సరాలు అక్కడ టీడీపీ తప్ప మరో పార్టీ గెలిచింది లేదు. ఇందులో 7 సార్లు కాంగ్రెస్, ఒక సారి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా హిందూపురంలో మాత్రం టీడీపీనే విజయం సాధించింది. ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టాలని వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. 2019లో గట్టి అభ్యర్థిని బరిలోకి దించిన వైసీపీ ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. ఇక ఈ సారి లేడీని ఇక్కడి నుంచి దింపాలని అనుకుంటుంది. సాధారణంగా బాలయ్య బాబుకు ముక్కుమీద కోపం ఎక్కువని రాష్ట్రం మొత్తం తెలుసు.
అపోజిషన్ లో ఉన్నది లేడీ కాబట్టి ఆయన ఏ విధంగానైనా టంగ్ స్లిప్ అయితే దాన్ని పట్టుకొని ఆయనపై విజయం సాధించవచ్చని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అందుకే ఇక్కడి నుంచి హిందూపురం వైసీపీ ఇన్చార్జి దీపికను బరిలో దించాలని చూస్తోంది. మాజీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇక్బాల్, నవీన్ నిశ్చల్ గ్రూపులుగా విడిపోవడంతో ఎవరి గ్రూపునకు కూడా సహకరించకుండా దీపికను బరిలోకి దించాలని అనుకుంటున్నారు జగన్. ఈ సారి అక్కడి నుంచి వచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం టీడీపీలో కూడా వర్గ పోరు మొదలైందని తెలిసింది. దీన్ని అనుకూలంగా మార్చుకొని సంప్రదాయాన్ని తుడిచేయాలని జగన్ అనుకుంటున్నారు. ఈ ఫలితాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి మరి.